ఎపి:మరో రెండు రోజుల పాటు వర్షాలు...సూర్యలంకలో రెడ్ ఎలెర్ట్!
విజయవాడ:బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో వర్షాలకు ఈదురు గాలులు కూడా తోడవుతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు రాష్ట్రంలో పలుచోట్ల సము ద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. ఇందుకు కారణాలు తెలియక స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అయితే గంటకు 40 నుండి 50 కి.మీల వేగంతో వీస్తున్న గాలుల ప్రభావం వల్లే సముద్రం ముందుకు వస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు విశ్లేషిస్తున్నారు. ఇదిలావుంటే అల్పపీడన ప్రభావం మరో రెండు రోజులు కొనసాగుతుందని, దీనివల్ల కోస్తా జిల్లాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వారు అంటున్నారు.
రెడ్ ఎలెర్ట్...హెచ్చరికలు
అల్పపీడన ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని అధికారులు సూచిస్తున్నారు. గుంటూరు జిల్లా బాపట్ల మండలం సూర్యలంక వద్ద సముద్రం పది మీటర్ల ముందుకొచ్చింది. ఆదివారం ఉదయం అలలు ఉవ్వెత్తున ఎగిసిపడడంతో బీచ్ ఒడ్డుకు వేసిన సిమెంటు రోడ్డు సైతం కోతకు గురై మూడు మీటర్ల మేర పగుళ్ళు ఇచ్చింది. దీంతో పర్యాటకులను అనుమతించలేదు. తీరం వద్ద రెడ్ అలర్ట్ ప్రకటించారు. మరో రెండు రోజుల వరకూ సందర్శకులను అనుమతించేది లేదని పోలీసులు ప్రకటించారు.
నీట మునక...అంతరాయం
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల పల్లపు ప్రాంతాలు నీటమునిగాయి. అనేక చోట్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఎగువప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా, గోదావరి నదులకు భారీగా వరద వస్తోంది. దీంతో ఆదివారం ఉదయానికే ప్రకాశం బ్యారేజి నిండుకుండలా మారడంతో 40 గేట్ల నుండి దిగువుకు నీటిని విడుదల చేశారు. అయినా ప్రకాశం బ్యారేజికి ఇంకా 30 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. అలాగే శ్రీశైలం జలాశయానికి కృష్ణా నది ఎగువ ప్రాంతాల నుంచి నీటి ప్రవాహం కొన సాగు తోంది. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయానికి ఎగువ జూరాల నుంచి విద్యుత్ ఉత్పాదన ద్వారా 32 వేల క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి 75,126 క్యూసెక్కులు కలిపి 1,07,126 క్యూసెక్కుల ప్రవాహం జలాశయానికి వచ్చి చేరుతోంది.
ముంపుకు గురైన...రోడ్లు
కృష్ణా జిల్లాలోని గన్నవరం, వెంకట నరసింహపురంలో పల్లపు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. అంతర్గత రోడ్లన్నీ ముంపునకు గురయ్యాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నందిగామ, జగ్గయ్యపేట, వీరులపాడు, వత్సవాయి, కంచికచర్లలో భారీ వర్షం కురిసింది. పెనుగంచిప్రోలులో మున్నేరు కాజ్వేపై వరద నీరు చేరే ప్రమాదం ఉండటంతో రాకపోకలపై అధికారులు అప్రమప్తమయ్యారు. కంచికచర్ల మండల కీసర బ్రిడ్జి వద్ద మున్నేరు ప్రవాహం ఉధృతంగా కొనసాగుతోంది. వీరులపాడు మండలం ఏనుగుగడ్డ-వైరా కట్లేరుకు భారీగా వరద నీరు రావటంతో వీరులపాడు-దాములూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
గోదావరి జిల్లాల్లో...భారీ వర్షాలు
తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం,గండేపల్లి,జగ్గంపేట మండలాలతో పాటు ఏజెన్సీ వ్యాప్తంగా భారీవర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా గత 24 గంటల్లో 11.58 మిల్లీమీటర్ల సరాసరి వర్షపాతం నమోదైందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా జనజీవనం స్తంభించింది. పోలవరం, పెరవలి, పెనుమంట్ర, ఉండి, కామవరపుకోట, మొగల్తూరు, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో వర్షం ప్రభావం ఎక్కువగా కన్పించింది. శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. జిల్లాలో సగటు వర్షపాతం 22.4 మిల్లీమీటర్లు నమోదైంది. శ్రీకాకుళంలో కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది.