ఏపీ అసెంబ్లీలో శాసనమండలి రద్దు తీర్మానం ఆమోదం: సీఎం జగన్ కీలక ప్రసంగం
అమరావతి: శాసనమండలికి ప్రజాధనం ఖర్చు చేయడం దండగ అని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సోమవారం శాసనమండలి రద్దు తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగించారు. ఇది మండలికి సంబంధించిన అంశం కాదన్నారు.
శాసనమండలి రద్దు అందుకే..
ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలా? వద్దా? అన్నదే మన ముందున్న ప్రశ్న అని సీఎం జగన్ అన్నారు. మండలిని రద్దు చేసే అధికారాన్ని రాజ్యాంగం అసెంబ్లీకే ఇచ్చిందని చెప్పారు. ఈ సందర్భంగా ఈనాడు పత్రికలో వచ్చిన పలు కథనాలను ఆయన ప్రస్తావించారు. ప్రజా ప్రయోజనాల కోసం అన్ని విధాలా ఆలోచించే శాసనమండలిని రద్దు చేస్తున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు. రాజకీయ కోణంలో పనిచేసే మండలి అవసరమా? అని జగన్ ప్రశ్నించారు. మండలిని రద్దు చేస్తూ తీర్మానం చేస్తున్నామని చెప్పారు. మన శాసనసభలోనే అనేక మంది మేధావులున్నారని జగన్ చెప్పారు. దేశంలో కేవలం 6 రాష్ట్రాల్లోనే శాసనమండళ్లు ఉన్నాయని తెలిపారు.
చంద్రబాబు పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు..
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని జగన్ మండిపడ్డారు. తెలంగాణలో ఓటుకు కోట్లు ఇస్తూ అడ్డంగా దొరికిపోయారని ధ్వజమెత్తారు. అప్పుడు ఎల్లో మీడియా ఏం చేసిందని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో తమ 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లుగా తీసుకుని, నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారని చంద్రబాబుపై మండిపడ్డారు. అప్పుడు ఎల్లో మీడియా చంద్రబాబుకు వత్తాసు పలికిందన్నారు. తాము అలా చేయలేమన్నారు.
చంద్రబాబులా తాను చేసివుంటే..
చంద్రబాబులాగే తాను చేసివుంటే.. టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఉండేది కాదని జగన్ స్పష్టం చేశారు. గురువారం మండలి రద్దుకు ప్రతిపాదన ఇచ్చామని.. సోమవారం మండలి రద్దు కోసమే సభ పెడుతున్నామని కూడా చెప్పామన్నారు. అయితే, ఎల్లో మీడియా కథనాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయన్నారు. ఎమ్మెల్సీలకు రూ. 5 కోట్లు ఆఫర్ ఇస్తున్నారని రాశాయని మండిపడ్డారు. మూడు రోజుల సమయం ఇచ్చే మండలిని రద్దు చేస్తున్నామని తెలిపారు.
మాటలు మార్చడంలో చంద్రబాబుదే రికార్డు..
మాటలు మార్చేది చంద్రబాబు నాయుడేనని జగన్ అన్నారు. చంద్రబాబు గతంలో ప్రత్యేక హోదాపై, నరేంద్ర మోడీపై, కాంగ్రెస్, సోనియా గాంధీపై అనుకూలంగా, ప్రతికూలంగా చేసిన వ్యాఖ్యల వీడియోలను అసెంబ్లీలో ప్రదర్శించారు. మండలి విషయంలోనూ చంద్రబాబు గతంలో చేసిన వ్యాఖ్యల వీడియోలను ప్రదర్శించారు.
ఎన్టీఆర్ అప్పుడు మండలిని రద్దు చేస్తే.. చంద్రబాబు ఇప్పుడు కావాలంటున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు ఏ విషయంలోనూ స్థిరత్వాన్ని చూపలేదని అన్నారు. తన అవసరానికి ఏదైనా మాట్లాడతారని అన్నారు. కూతురును ఇచ్చిన మామను కూడా పొడవడానికి వెనుకాడలేదని జగన్ అన్నారు. అన్యాయం జరుగుతుందన్న చంద్రబాబుకు తాను పలు ప్రశ్నలు సంధిస్తున్నట్లు తెలిపారు. రాజధాని రైతులను చంద్రబాబు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీలను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్లు ఇస్తామని చెప్పారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే తాము వికేంద్రీకరణ బిల్లు తీసుకొచ్చామన్నారు.
బాహుబలి లాంటి మోసం చేయం..
అసెంబ్లీ లేజిస్టేటివ్ రాజధానిగా అమరావతిని.. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను.. న్యాయ రాజధానిగా కర్నూలును ప్రకటిస్తే అది ఎవరికి అన్యాయం చేసినట్లవుతుందని జగన్ ప్రశ్నించారు. సింగపూర్, బాహుబలి లాంటి మోసపు సినిమాలు చూపించకుండా ప్రజల అభివృద్ధి కోసం, అందరికీ న్యాయం చేయడం కోసం నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు. సభలు, మండళ్లు ప్రజలకు మేలు చేయాలని.. నిర్ణయాలు ఆలస్యం కాకూడదన్నారు. అందుకే మండలిని రద్దు చేసే తీర్మానం చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. రద్దు తీర్మానాన్ని అందరూ సమర్థించాలని జగన్ కోరారు.
మండలి రద్దు తీర్మానంకు అసెంబ్లీ ఆమోదం..
అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం శాసనమండలి రద్దు తీర్మానంపై ఓటింగ్ నిర్వహించారు. అసెంబ్లీలో సభ్యులు కానీ.. మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్లను ఓటింగ్కు దూరంగా ఉండాలని సూచించారు. ఆ తర్వాత తీర్మానానికి మద్దతిచ్చేవారు వారి వారి స్థానాల్లో నిల్చుకోవాలని కోరారు. దీంతో సభ్యులంతా నిల్చున్నారు. మండలి రద్దు తీర్మానానికి 133 మంది సభ్యులు మద్దతు పలికారు. వ్యతిరేకంగా ఎవరూ ఓటు వేయలేదు. జనసేన నుంచి సస్పెండైన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా మండలి రద్దు తీర్మానానికి మద్దతు తెలిపారు.
దీంతో శాసనమండలి రద్దు తీర్మానంకు శాసనసభ ఆమోదం తెలిపిందని స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. ఆ తర్వాత సభను నిరవధిక వాయిదా వేశారు. కాగా, 151 మందిలో 133 మంది సభ్యులు మాత్రమే హాజరుకావడంపై వైసీపీలో కీలక చర్చకు దారితీసింది. వారంతా ఏమయ్యారని సీఎం జగన్ ఆరా తీశారు.