రోజా టు లోకేష్!... సభలో ఎవరికి చెక్?, అదీ చంద్రబాబు అంటే: తోట
విజయవాడ: అంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి (శనివారం) ప్రారంభం కానున్నాయి. ఇవి హాట్ హాట్గా జరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. వైసిపి ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్, టిడిపిలోకి వైసిపి ఎమ్మెల్యేల చేరిక, రాజధాని అమరావతిలో టిడిపి నేతల భూదందా ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.
రోజా సస్పెన్షన్ను ఎత్తివేయాలని వైసిపి సభలో పట్టుబట్టే అవకాశాలు లేకపోలేదు. అలాగే తమ పార్టీ ఎమ్మెల్యేలు టిడిపిలో చేరడాన్ని సభలో వైసిపి నిలదీయనుంది. చేర్చుకోవాలనుకుంటే రాజీనామా చేయించి ఉప ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేయనున్నారు.
ఇక, మూడు నాలుగు రోజులుగా ప్రకంపనలు రేపుతున్న టిడిపి నేతల భూదందా ఆరోపణల పైన చర్చకు పట్టుబట్టే అవకాశాలున్నాయి. చంద్రబాబు, నారా లోకేష్, మంత్రులు నారాయణ, పత్తిపాటి పుల్లారావు, మురళీ మోహన్, ఇతర టిడిపి నేతల పైన వైసిపి ఆరోపణలు, సాక్షి కథనాలు తెలిసిందే. మొత్తానికి బడ్జెట్ సమావేశాలు హాట్హాట్గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకే: తోట
సీఎం చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకే కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మళ్లీ దీక్ష అంటున్నారని టిడిపి ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు శుక్రవారం ఆరోపించారు. గతంలో ఎన్నో పార్టీలు కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చాయన్నారు.
నలభై ఏళ్ల కాపు రిజర్వేషన్ ఉద్యమంలో చంద్రబాబు కాపులకు రిజర్వేషన్ కల్పిస్తానని ఎప్పుడూ చెప్పలేదన్నారు. 2014 ఎన్నికల్లో మాత్రం కాపులకు రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పారని, మేనిఫెస్టోలో పెట్టారన్నారు. రాష్ట్ర విభజన, సమస్యల వల్ల అది అమలు చేయడంలో కాస్త జాప్యం జరిగిందన్నారు.
కాపు నేతగా ఆయన చెప్పిన మాటలను తానెప్పుడైనా మర్చిపోయానేమో కానీ, చంద్రబాబు మాత్రం ఇచ్చిన మాటను మరువలేదని, అదీ చంద్రబాబు అంటే అన్నారు. కాపులకు రిజర్వేషన్లు ఎలా ఇవ్వాలనే విషయమై ఆలోచిస్తున్నారన్నారు. ప్రస్తుతం కాపు ఉద్యమాన్ని పక్కదోవ పట్టించే కుట్ర జరుగుతోందన్నారు.
కాపు ఉద్యమాన్ని రాజకీయం చేసి మాట్లాడడం సరికాదన్నారు. చంద్రబాబుపై ముద్రగడ వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. నెల రోజుల్లో మళ్లీ తిరుగుబాటు చేస్తామని హెచ్చరించడం ఆక్షేపణీయమన్నారు. వ్యక్తిగత ఎజెండాతో ముద్రగడ ముందుకు సాగడంతో కాపులకు అన్యాయం జరుగుతుందన్నారు.