ఏపీ అసెంబ్లీ: ముఖ్యమంత్రీ అతీతుడేమీ కాదు: ఎవరి ఫైళ్లు వాళ్లే: ఆలింగనాలకు నో ఛాన్స్
అమరావతి: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఏర్పాట్లు రెడీ అయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో అసెంబ్లీ సమావేశం కాబోతోండటం వల్ల ముందుజాగ్రత్తలను తీసుకుంది ప్రభుత్వం. దీనికోసం ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది. మంగళవారం ఉదయం 10 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగంతో శాసనసభ, శాసన మండలి సమావేశాలు ఆరంభం కానున్నాయి. గవర్నర్ రాజ్భవన్ నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
Recommended Video
సభ్యులకు మాత్రమే ఎంట్రీ
కరోనా వైరస్ వ్యాప్తి చెందిన ప్రస్తుత పరిస్థితుల్లో భౌతిక దూరాన్ని పాటించాల్సి ఉన్నందున కొన్ని ప్రత్యేక మార్గదర్శకాలను ప్రభుత్వం రూపొందించింది. అసెంబ్లీ కార్యదర్శి దీనికి సంబంధించిన బులెటిన్ను తాజాగా విడుదల చేశారు. ఈ బులెటిన్ ప్రకారం.. సభ ప్రాంగణంలోకి శాసనసభ, శాసన మండలి సభ్యులకు మాత్రమే అనుమతి లభిస్తుంది. వారి వెంట ఎవ్వరూ ఉండకూడదని స్పష్టం చేశారు. చివరికి గన్మెన్, వ్యక్తిగత సిబ్బంది కూడా అసెంబ్లీ ఆవరణల్లోకి ప్రవేశించి కూడదని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు తమ వెంట గన్మెన్లు, పీఎస్, పీఏ, పీఎస్ఓలను తీసుకుని రాకూడని ఈ బులెటిన్లో పొందుపరిచారు.
భౌతిక దూరం, మాస్కుల ధారణ తప్పనిసరి..
శాసనసభ్యులు పరస్పరం అభినందించుకోవడం, ఆలింగనం చేసుకోవడం, చేతులను కలుపుకోవడాన్ని నిషేధించారు. ప్రతి ఒక్కరు కూడా కనీనం నాలుగు అడుగుల దూరాన్ని తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. మాస్క్లను ధరించడం.. సభలోనికి ప్రవేశించడానికి ముందు.. బయటికి వచ్చిన తరువాత చేతులను శానిటైజర్తో శుభ్రం చేసుకోవడాన్ని తప్పనిసరి చేశారు. స్పీకర్, ముఖ్యమంత్రి సైతం ఈ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ఎమ్మెల్యేలు తమ కారు పాస్ కచ్చితంగా అతికించాల్సి ఉంటుంది.
విజిటర్లపైనా నిషేధం
అసెంబ్లీ ఆవరణలోకి సందర్శకులకు సైతం అనుమతించరు. సాధారణంగా అసెంబ్లీ సమావేశాల ప్రొసీడింగ్స్ను పరిశీలించడానికి రోజూ పరిమితంగా కొంతమంది సందర్శకులకు అనుమతి ఇస్తుంటారు. వారితో పాటు ఎమ్మెల్యేల బంధువులు, కుటుంబ సభ్యులు పాసుల ద్వారా మీడియా పాయింట్, లాంజ్లల్లో ప్రవేశిస్తుంటారు. అలాంటి వారికి ఈ సారి అనుమతి ఇవ్వట్లేదు. విజిటర్లను అనుమతించకూడదని నిర్ణయించారు.
బ్యానర్లు.. ప్లకార్డులను తేవద్దంటూ..
శాసనసభ్యులు తమ వెంట బ్యానర్లు, ప్లకార్డులు, స్ప్రే వంటివేవీ తీసుకుని రాకూడని తాజా బులెటిన్లో పేర్కొన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఆందోళనలకు అనుమతి లేదని ఆదేశాలు ఇచ్చారు. అధికార పార్టీ తీసుకునే నిర్ణయాలపై నిరసనలను వ్యక్తం చేయడానికి ప్రతిపక్ష సభ్యులు తమ వెంట ప్లకార్డులను తీసుకుని రావడం సాధారణంగా జరిగే ప్రక్రియే. ఈ సారి కోవిడ్ వల్ల నెలకొన్న ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వాటిని తమ వెంట తీసుకుని రావొద్దని పేర్కొన్నారు.