జనవరిలో ఏపీ అసెంబ్లీ అత్యవసర సమావేశం..? సభ ముందుకు కమిటీ రిపోర్ట్
ఆంధ్రప్రదేశ్లో రాజధాని మార్పు ఊహాగానాల నేపథ్యంలో పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. రాజధాని మార్పుకు సంబంధించి జీఎన్ రావు కమిటీ ప్రతిపాదనలపై మంత్రివర్గం శుక్రవారం చర్చించింది. బోస్టన్ కమిటీ ఇచ్చే నివేదిక తర్వాత హై పవర్ కమిటీ వేయాలని నిర్ణయించింది. జనవరి మొదటివారంలో బోస్టన్ కమిటీ రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత మంత్రులు, ఐఏఎస్ అధికారులతో వేసిన హై పవర్ కమిటీ కూడా రిపోర్ట్ ఆ లోపు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
జనవరి మొదటి వారంలో బోస్టన్ కమిటీ రిపోర్ట్ రావడంతో 18 లేదా 19వ తేదీన అసెంబ్లీని అత్యవసరంగా సమావేశం కావాలని భావిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీ నివేదికతో హై పవర్ కమిటీ కూడా ఆ లోపు నివేదిక ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 18, 19వ తేదీల్లో హై పవర్ కమిటీ రిపోర్ట్ను అసెంబ్లీలో సభ ముందు ఉంచాలని భావిస్తోన్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీలో కమిటీ రిపోర్ట్కు ఆమోదం తెలిపి.. రాజధాని మార్పు ప్రక్రియను పూర్తిచేస్తారని తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఆ తేదీలు ఒకటి రెండు అటు ఇటుగా కూడా ఉండే అవకాశం ఉంది.
జీఎన్ రావు కమిటీ నివేదికపై శుక్రవారం ఏపీ అసెంబ్లీ చర్చించింది. బోస్టన్ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత.. హై పవర్ కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నది. కమిటీ రిపోర్ట్ ఆధారంగా రాజధాని మార్పుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నది. ఈ లోపు అసెంబ్లీలో నివేదిక ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఆ మేరకు అడుగులు వేస్తున్నది.