నారా లోకేష్కు తృటిలో తప్పిన ప్రమాదం: పల్లె వెలుగు బస్సులో ప్రజలతో ఇలా..
అమరావతి: ఏపీ ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ ఛార్జీలకు వ్యతిరేకంగా టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేతృత్వంలో మంగళగిరి బస్టాండ్ వద్ద ఆ పార్టీ ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు. పెంచిన ఆర్టీసీ ఛార్జీలను వెంటనే తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పల్లెవెలుగు బస్సులో నారా లోకేష్ ఎక్కారు. పెంచిన ఛార్జీల గురించి ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు.
చంద్రబాబు కొడుకును గెలిపించుకోలేని చవట దద్దమ్మ.. చిన్న మెదడు చితికింది.. ఏకిపారేసిన రోజా
పెంచిన ఛార్జీలపై లోకేష్ ఫైర్..
15 కిలోమీటర్లకు పెంచిన రేటు ప్రకారం ఛార్జీలు రూపాయిన్నర పెరగాలి కానీ.. 5 రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నారని ఈ సందర్భంగా లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు ప్రయాణికులు. ఏడాదికి రూ. 700 కోట్ల నుంచి రూ. 1000 కోట్ల భారం ప్రజలపై పడుతుందని లోకేష్ అన్నారు. పెంచిన ధరలు తగ్గించే వరకూ తమ పోరాటం ఆగదని లోకేష్ తెలిపారు.
జగన్పై సెటైర్లు..
అన్ని పెంచుకుంటూ పోతాం అని జగన్ చెబుతుంటే.. ప్రజలంతా సంక్షేమ కార్యక్రమాలు పెంచుతారని అనుకున్నారని.. అయితే, జగన్ మాత్రం ఇసుక ధర, ఆర్టీసీ ధరలు పెంచుకుంటూ పోతున్నారని లోకేష్ సెటైర్లు వేశారు. త్వరలో విద్యుత్ ఛార్జీలు కూడా పెంచేస్తారని జోస్యం చెప్పారు.
తప్పిన ప్రమాదం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆవరణ సమీపంలో మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్ తోపాటు పలువురు ఎమ్మెల్యేలకు తృటిలో ప్రమాదం తప్పింది. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి పాదయాత్రగా వెళుతున్న సమయంలో ఓ డ్రోన్ కెమెరా విద్యుత్ తీగలకు తగిలి కిందపడిపోయింది.
డ్రోన్ సమస్య.. వెంటనే స్పందించిన పోలీసులు..
డ్రోన్ ఒక్కసారిగా కిందపడటంతో ఆ పక్కనే వెళుతున్న ఎమ్మెల్సీలు ఉలిక్కిపడ్డారు.భయంతో పక్కకు పరుగులు పెట్టారు. ఆ డ్రోన్ ఎవరిపైనా పడకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పెంచిన ఆర్టీసీ ఛార్జీలకు వ్యతిరేకంగా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాదయాత్రగా అసెంబ్లీకి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అసెంబ్లీ ఆవరణలో భద్రత పర్యవేక్షణ కోసం పోలీసులు ఈ ఢ్రోన్ ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. డ్రోన్ కూలిపోవడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. దాన్ని తీసుకెళ్లారు.