సెప్టెంబర్ 6 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు...23 నుంచి 27 వరకు చంద్రబాబు అమెరికా పర్యటన
అమరావతి:ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షకాల సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. సెప్టెంబర్ 6 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు స్పీకర్ కోడెల శివప్రసాదరావు వెల్లడించారు.
ఈ సమావేశాలను పది రోజుల పాటు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శాసన సభ వర్షాకాల సమావేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ సమావేశాలకు ప్రతిపక్ష పార్టీ వైసిపి హాజరుకావాలని ఆ పార్టీ అధినేత జగన్ను స్పీకర్ కోరే అవకాశం ఉందని తెలిసింది. అలాగే ఈ సమావేశాల్లో పలు కీలకమైన బిల్లులను ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
ఇదిలావుంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ నెలలో అమెరికాలో పర్యటించనున్నారు. సెప్టెంబరు 23 నుంచి 27 వరకు ఐదు రోజులపాటు ఆయన న్యూయార్క్లో వ్యవసాయంపై జరిగే అంతర్జాతీయ సదస్సు లో పాల్గొంటారని తెలిసింది. వ్యవసాయంలో ఫెస్టిసైడ్స్ వాడకాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం అనేఅంశంపై ఈ సదస్సును నిర్వహిస్తున్నారు.
సేంద్రీయ వ్యవసాయం తీరుతెన్నుల గురించి ఈ సదస్సులో సమగ్ర చర్చ జరగనుందని సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న సిఎం చంద్రబాబును ఇందులో పాల్గొవాల్సిందిగా ఆ సదస్సు నిర్వాహకుల నుంచి చంద్రబాబుకు ఆహ్వానం అందింది.
ఈ క్రమంలో సెప్టెంబరు 23 నుంచి ఐదురోజుల పాటు జరిగే ఆ సదస్సులో ఏపీలో అమలు చేస్తున్న జీరో బడ్జెట్ వ్యవసాయం, సాగులో అధునాతన విధానాల గురించి చంద్రబాబు ప్రసంగింస్తారని తెలుస్తోంది. అనంతరం ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొని 'పరిశ్రమలు 4.0' అనే నివేదికను సిఎం చంద్రబాబు విడుదల చేయనున్నారు.