స్పీకర్గా తమ్మినేని ఏకగ్రీవం: సభలో అధికారిక ప్రకటన: 30 మంది ఎమ్మెల్యేలతో కలిసి..
ఏపీ శాసనసభ నూతన స్పీకర్గా తమ్మినేని సీతారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను ప్రొటెం స్పీకర్ గు రువారం సభలో ప్రకటించటం లాంఛనమే. ముఖ్యమంత్రి జగన్ స్పీకర్గా తమ్మినేని పేరును ఖరారు చేసిన తరువాత పార్టీలోని సీనియర్లు అందరూ మద్దతు ప్రకటించారు. ఇక, ఏపీ శాసనసభ సమావేశాల్లో తొలి రోజున స్పీకర్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదల చేసారు. తమ్మినేని నామినేషన్ మాత్రమే దాఖలు కావటంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. సభలో ప్రొటెం స్పీకర్ తమ్మినేని సీతారాంగా అధికారికంగా ప్రకటన చేయనున్నారు.
తమ్మినేని నామినేషన్..
ఏపీ శాసనసభ నూతన స్పీకర్ ఎన్నిక కోసం శాసనసభా సమావేశాలు ప్రారంభమైన వెంటనే ప్రొటెం స్పీకర్ శంబంగి చిన అప్పలనాయుడు నోటిఫికేషన్ విడుదల చేసారు. సాయంత్రం 5 గంటలలోపు నామినేషన్ దాఖలుకు అవకాశం ఉంది. శాసన సభ కార్యదర్శి వద్ద నామినేషన్ దాఖలు చేయాలని ప్రొటెం స్పీకర్ శంబంగి చిన వెంకట అప్పలనాయుడు ప్రకటించారు. వైసీపీ నుండి స్పీకర్ పదవికి తమ్మినేని సీతారాం నామినేష్ దాఖలు చేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ 30 మంది సభ్యులు మద్దతు పలికారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సీతారం శ్రీకాకుళం నుండి బీసీ వర్గానికి చెందిన వారు. ఆయన నియామకం ద్వారా ఉత్తరాంధ్ర బీసీ వర్గాలకు జగన్ మరింత ప్రాధాన్యత ఇచ్చినట్లయింది. గురువారం ఆయన అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
తొమ్మిదేళ్లు మంత్రిగా తమ్మినేని సీతారాం..
ఉత్తరాంధ్ర నుండి సుదీర్ఘ రాజకీయ ప్రస్తానం కలిగిన నేతగా..గుర్తింపు ఉన్న బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాం ఏపీ శాసనసభ నూతన స్పీకర్గా నియమితులయ్యారు. సీతారాం కళింగ కమ్యూనిటీకి చెందిన వారు. అయితే శ్రీకాకుళం జిల్లాకు ఆ పదవి ఇవ్వటం ద్వారా ఉత్తరాంధ్రలో సానుకూలత ఉంటుందని అంచనా వేసారు. సీతారాం 1983 నుండి రాజకీయాల్లో ఉండటంతో పాటుగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ హయాంలో తొమ్మిదేళ్లు మంత్రిగా పని చేసారు. టీడీపీ అధినేత చంద్రబాబు తో విభేదాలు రావటంతో టీడీపీని వీడి ప్రజారాజ్యంలో చేరారు. 2009లో ఆముదా లవలస నుండి ప్రజారాజ్యం అభ్యర్దిగా పోటీ చేసి ఓడిపోయారు 2014లో వైసీపీ నుండి పోటీ చేసి ఓడిన సీతారాం..తాజా ఎన్నికల్లో ఆయన సమీప బంధువు.. టీడీపీ అభ్యర్ది కూన రవి కుమార్ను 14వేల ఓట్లతో ఓడించారు.
Recommended Video
చంద్రబాబుకు ధీటుగా...
ఏపీ శాసనసభలో ప్రస్తుతం అధికార పక్షం వైసీపీ బలం 151 కాగా..ప్రతిపక్ష టీడీపీ బలం కేవలం 23 స్థానాలు మాత్రమే. అయితే, జగన్ స్పీకర్గా తమ్మినేని ఎంపిక వెనుక అనేక వ్యూహాలు ఉన్నాయి. టీడీపీలో అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి..దాదాపు తొమ్మిదేళ్లుగా మంత్రిగా పని చేసిన సీతారాం..చంద్రబాబు తో విబేధాల కారణంగా పార్టీని వీడారు. ఆయన వైసీపీలో చేరిన నాటి నుండి చంద్రబాబు లక్ష్యంగా అనేక ఆరోపణలు..విమర్శలు గుప్పించారు. గతంలో అనేక శాఖలు నిర్వహించిన అనుభవంతో పాటుగా న్యాయ శాఖ నిర్వహించటం ఇప్పుడు స్పీకర్గా కలిసి వచ్చింది. టీడీపీతో తమ్మినేని సమర్ధవంతంగా వ్యవహరించగలరే నమ్మకంతో జగన్ ఆయన వైపు మొగ్గు చూపారు. సౌమ్యుడిగా ఉండే తమ్మినేని రాజకీయంగా అనేక ఒడిదుడికులను ఎదుర్కొన్నారు. ఇక, ఇప్పుడు ఉత్తరాంధ్రకు స్పీకర్ పదవి ఇవ్వటంతో రాజధాని గుంటూరు జిల్లాకు చెందిన కోన రఘుపతికి ఉప సభాపతిగా అవకాశం దక్కింది.