అసెంబ్లీలో మళ్లీ మూడు రాజధానుల బిల్లుల ఆమోదం- రేపు మండలికి...
ఏపీలో మూడు రాజధానులకు ఉద్దేశించిన అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీయే బిల్లులను అసెంబ్లీ మరోసారి ఆమోదించింది. గతంలో ఇవే బిల్లులను సుదీర్ఘంగా చర్చించి ఆమోదించినందున, ఈసారి ఎలాంటి చర్చ లేకుండానే వీటికి ఆమోద ముద్ర వేసింది. ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఈ బిల్లులను సభలో ప్రవేశపెట్టగా.. సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అంతకు మందు గవర్నర్ ప్రసంగం తర్వాత టీడీపీ సభ నుంచి వాకౌట్ చేయడంతో ఈ రెండు బిల్లులు ఏకగ్రీవంగా ఆమోదం పొందినట్లు స్పీకర్ తమ్మినేని ప్రకటించారు.
ఏపీలో మూడు రాజధానులకు ఉద్దేశించిన రెండు బిల్లులను ప్రభుత్వం అసెంబ్లీ ప్రారంభం సమయంలో అనూహ్యంగా తెరపైకి తెచ్చింది. ఆ తర్వాత బీఏసీలో కూడా వీటికి అమోదం లభించడంతో అసెంబ్లీలో వీటిని ప్రవేశపెట్టి ఆమోదం తీసుకుంది. గతంలో మండలికి ఇవే బిల్లులు వెళ్లిన సందర్భంగా వాటిని ఆమోదించకుండా, తిరస్కరించకుండా సెలక్ట్ కమిటీకి ఛైర్మన్ పంపారు. దీంతో ఈసారి మండలిలో ఏం జరగబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. రేపు ఉదయం మండలి ముందుకు ఈ బిల్లులు మరోసారి రానున్నాయి. ఇప్పటికే టీడీపీ ఈ బిల్లులు మండలిలో ప్రవేశపెట్టడం చట్ట విరుద్ధమని చెబుతోంది. దీంతో రేపు వీటిని ఎలా ప్రవేశపెట్టాలనే విషయంలో ప్రభుత్వం ఇవాళ సాయంత్రం కసరత్తు చేయనుంది.
గతంలో ఓసారి మండలికి రాజధాని బిల్లులు పంపినప్పటికీ సభ నిర్ణయం తీసుకోకుండా సెలక్ట్ కమిటీకి పంపడం, ఆ తర్వాత సెలక్ట్ కమిటీ ఏర్పాటు కాకపోవడంతో వీటికి కాలాతీతం అయిందని ప్రభుత్వం చెబుతోంది. అందుకే మరోసారి అసెంబ్లీలో పెట్టి ఆమోదం తీసుకున్నారు. ఈసారి మండలి వీటిని ఆమోదించకుండా ఏం చేయబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.