ఎఫ్ఆర్బీఎం చట్ట సవరణకు ఏపీ అసెంబ్లీ ఆమోదం- రాష్ట్రంపై మరింత అప్పుల భారం
ఏపీ అసెంబ్లీ ఇవాళ మరో కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటికే అప్పుల భార ఎక్కువగా ఉండగా... ఇప్పుడు దాన్ని మరింత పెంచేందుకు వీలుగా ఎఫ్ఆర్బీఎం చట్టంలో మార్పులు చేస్తూ రూపొందించిన బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి మరింత ఎక్కువ అప్పలు తెచ్చుకునేందుకు అవకాశం కలిగింది.
2005 నాటి ఎఫ్ఆర్బీఎం చట్టానికి సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో సవరణ బిల్లు ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతి మేరకు ఇప్పటివరకూ ఉన్న 3 శాతం అప్పుల పరిమితిని ఐదు శాతానికి పెంచుతూ ప్రభుత్వం చట్టంలో సవరణలు చేసింది. దీంతో రాష్ట్ర స్ధూల ఉత్పత్తిలో 5 శాతం వరకూ అప్పులు తెచ్చుకునేందుకు ప్రభుత్వానికి అవకాశం దక్కనుంది. అదే సమయంలో ప్రభుత్వంతో పాటు ప్రజలపైనా అప్పుల భారం పెరగబోతోంది.
కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం భారీగా పడిపోయింది. దీంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కొన్ని పరిమితులతో ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంచుకునేందుకు కేంద్రం అవకాశం కల్పించింది. తాము సూచించిన సంస్కరణలు అమలు చేస్తే గరిష్టంగా స్ధూల ఉత్పత్తిలో ఐదుశాతానికి అప్పుల పరిమితి పెంచుకునేందుకు అవకాశం ఇచ్చింది. దీంతో కేంద్రం సూచించిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణలు అమలు చేసేందుకు సిద్ధమైంది. తాజా సవరణల ప్రకారం రాష్ట్రం మొత్తం అప్పులు జీడీపీలో 35 శాతం మించకుండా తీసుకోవాల్సి ఉంటుంది.