స్ధానిక ఎన్నికలను వ్యతిరేకిస్తూ ఏపీ అసెంబ్లీ తీర్మానం- నిరవధిక వాయిదా
ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికలను వ్యతిరేకిస్తూ ఇప్పటికే ప్రకటనలు చేస్తూన్న వైసీపీ ప్రభుత్వం, హైకోర్టులోనూ అదే వైఖరి అవలంబిస్తోంది. ఎన్నికల వాయిదా కోసం వైసీపీ ప్రభుత్వం చేసిన అభ్యర్ధను హైకోర్టు అంగీకరించలేదు. ఎన్నికల నిర్వహణపై స్టే కోసం ప్రభుత్వం చేసిన అభ్యర్ధనను హైకోర్టు నిరాకరించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో ఓ తీర్మానం చేసింది.
ఏపీలో స్ధానిక ఎన్నికల నిర్వహణకు ప్రస్తుతం పరిస్ధితులు అనుకూలంగా లేవని, వచ్చే ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు జరుగుతున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్నట్లు ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో ఓ తీర్మానం ప్రవేశపెట్టింది. 1994 నాటి ఏపీ పంచాయతీ రాజ్ చట్టంలో తగు మార్పులు చేయాల్సి ఉందని, ఆ తర్వాతే ఎన్నికల నిర్వహణకు తగిన పరిస్దితులు ఉంటాయని ఈ తీర్మానంలో ప్రభుత్వం పేర్కొంది. శాసనసభ వ్యవహారాలమంత్రి బుగ్గన రాజేంద్రనాద్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. టీడీపీ సభ్యులు అంతకుముందే సభ నుంచి వాకౌట్ చేశారు. దీంతో తీర్మానం ఆమోదిస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.
స్ధానిక ఎన్నికల నిర్వహణకు వ్యతిరేకంగా తీర్మానం ఆమోదం పొందిన అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం సభను నిరవధికంగా వాయిదా వేశారు. దీంతో శాసనసభ శీతాకాల సమావేశాలు ముగిశాయి. ఈసారి అసెంబ్లీ సమావేశాలు ఐదురోజుల పాటు 39 గంటల పాటు జరగగా.. ఇందులో ప్రభుత్వం 18 బిల్లులు ప్రవేశపెట్టింది. ఇందులో రెండు బిల్లులు అనంతరం ఉపసంహరించుకుంది. మరో బిల్లుతో కలుపుకుని మొత్తం 19 బిల్లులను శాసనసభలో ఆమోదించారు. మరో రెండు తీర్మానాలను కూడా ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టి ఆమోదించింది.