ఎపి అసెంబ్లీ:రెండో రోజు సమావేశాలు ప్రారంభం...ప్రశ్నోత్తరాల్లో చర్చనీయాంశాలు ఇవీ!
అమరావతి:ఎపి అసెంబ్లీ వర్షా కాల సమావేశాల్లో రెండో రోజు సభాకార్యాక్రమాలు ప్రారంభమయ్యాయి. ముందుగా ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన హరికృష్ణతో పాటు మరో 8 మంది మాజీ శాసనసభ సభ్యులకు ఉభయసభలు సంతాపం తెలుపుతున్నాయి.
ప్రతిపక్షం కోసం కాదు...ప్రజలను మెప్పించే వ్యూహాలు ఉండాలి:అసెంబ్లీ వ్యూహ కమిటీ సభ్యులతో చంద్రబాబు
అనంతరం జరిగే శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో డ్వాక్రా రుణాల మాఫీ, రాష్ట్రంలో భూముల పునఃపరిష్కార సర్వే, భాషా పండితుల పదవులస్థాయి పెంపు, చెరుకు రైతులకు విత్తనంపై సబ్బిడీ, పేదలకు ఇళ్లపట్టాలు, అంగన్వాడీ ఆయాల అర్హతలు, ఖాళీగా ఉన్న పదవుల భర్తీ, బనగానపల్లె నియోజకవర్గంలో రాళ్ల పేల్చివేత కార్యకలాపాలు, గ్రామీణ, పట్టణ గృహ నిర్మాణ పథకం, రాష్ట్రంలో పడిపోతున్న విద్య నాణ్యత, నీటిపారుదల రంగం అంశాలు చర్చకు రానున్నాయి.
ప్రశ్నోత్తరాల్లో...చర్చ
వీటితో పాటుగా విశాఖపట్నం జిల్లాలో దివీస్ ఫార్మా వల్ల కాలుష్యం, ఎన్టీఆర్ విద్యోన్నతి, నిరుద్యోగ భృతి, న్యాయవాదుల సంక్షేమం, ఉపాధి కల్పనా కేంద్రాలు, మహిళలపై దురాగతాలు, ఎంజీఎన్ఆర్ఈజీ నిధులు, అనంతపురం జిల్లాలో ఎంజీఎన్ఆర్ఈజీ అవినీతి, కాకినాడలో హార్వర్డ్ పార్క్, పెండెకల్లులో పీహెచ్సీ, రాజధాని నగర అభివృద్ధి వంటి అంశాలు శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో చర్చించాలని భావిస్తున్నారు.
పోలవరం...గ్యాలరీ వాక్
ఇదిలావుంటే గురువారం జరిగిన బిఎసి సమావేశంలో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలను ఏడు రోజుల పాటు జరపాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈనెల 6 న ప్రారంభించి 19 వరకు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. 12న పోలవరం గ్యాలరీ వాక్ నిర్వహించనున్నారు.
కీలక చర్చలు...బిల్లులు...
అలాగే మొత్తం ఐదు సవరణ బిల్లులు సభలో ఉంచాలని నిర్ణయించారు. మెడికల్ రిప్రజెంటేటివ్స్ బిల్లును కూడా ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారని తెలిసింది. 6 నుండి 19 వరకూ జరిగే ఈ సమావేశాల్లో 8,9,13,14,15,16 తేదీల్లో సెలవులు ప్రకటించారు. మిగిలిన రోజుల్లో రోజుకో అంశం చొప్పున సమావేశాల్లో సిఎం చంద్రబాబు చర్చకు పెట్టనున్నారు.
కేంద్రం టార్గెట్ గా...చర్చలు
మరోవిధంగా చూస్తే మొత్తంగా ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వ తీరుపై ప్రజల్లో చర్చ జరిగేలా అందుకు అనుగుణమైన అంశాల్ని తెరమీదకు తేనున్నారు. అలాగే కేంద్ర యూనివర్శిటీల ఏర్పాటుకు సంబంధించిన అంశంపైనా చివరిరోజు చర్చించాలని, తద్వారా కేంద్రం చేస్తున్న మోసాన్ని ఎత్తి చూపాలని సమావేశంలో నిర్ణయించారు. స్పీకర్ కోడెల అధ్యక్షతన జరిగిన బిఎసి సమావేశానికి టిడిపి నుండి మంత్రి కాల్వ శ్రీనివాసులు, బిజెపి నుండి విష్ణుకుమార్రాజు హాజరయ్యారు.