మూడు రోజుల అసెంబ్లీ సమావేశాలు: రెండు కీలక బిల్లులు..టీడీపీ అభ్యంతరం: బీఏసీలో నిర్ణయం...!
Recommended Video
ముందు నుండి అంచనా వేస్తున్నట్లుగానే మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అందులో భాగంగా స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. మరి కాసేపట్లో ప్రారంభ మయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం నుండి కీలకంగా రెండు బిల్లులను ప్రతిపాదిస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రతిపక్షానికి సమాచారం ఇచ్చింది. అభివృద్ధి వికేంద్రీకరణ..సీఆర్డీఏ రద్దు బిల్లు ఈ రోజు సమావే శంలో ప్రతిపాదిస్తున్నట్లుగా ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ప్రభుత్వం నుండి ముఖ్యమంత్రి జగన్ తో పాటుగా మంత్రులు బుగ్గన..కన్నబాబు..కొడాలి నాని..అనిల్ కుమార్ హాజరయ్యారు. టీడీపీ నుండి శాసనసభా పక్ష ఉప నేత అచ్చెన్నాయుడు హాజరయ్యారు.
అయితే, ప్రభుత్వం ఈ రోజు సమావేశం పిలిచి..బిల్లులు ఇప్పుడు ప్రతిపాదించి..వెంటనే చర్చ..ఆమోదం ప్రతిపాదన పైన టీడీపీ నుండి హాజరైన అచ్చెన్నాయుడు అభ్యంతరం వ్యక్తం చేసారు. అయితే, మంత్రులు టీడీపీ వికేంద్రీకరణకు వ్యతిరేకమా అంటూ అచ్చెన్నాయుడును నిలదీసారు. తమ విధానం ఏంటో సభలోనే చెబుతామని..తమకు మాట్లాడేందుకు పూర్తి సమయం ఇవ్వాలని అచ్చెన్నాయుడు స్పీకర్ ను అభ్యర్దించినట్లు సమాచారం.
బీఏసీ సమావేశంలో ప్రభుత్వం తాము ప్రతిపాదించే రెండు బిల్లుల విషయం పైన స్పష్టత ఇచ్చింది. ముందుగా ఈ రోజు సభలో ఈ రెండు బిల్లులను ప్రతిపాదించనుంది. ఈ బిల్లుల పైన చర్చించి..ఈ రోజే శాసన సభలో ఆమోదించేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ రోజు శాసనసభలో ఆమోదించి..మంగళవారం మండలిలో ప్రతిపాదించాలనేది ప్రభుత్వం వ్యూహం. మండలిలో సంఖ్యా పరంగా ఎక్కువగా టీడీపీ సభ్యులు ఉండటంతో..అక్కడ బిల్లు ఆమోదానికి అడ్డంకులు ఏర్పడితే ఏం చేయాలనే దాని పైన ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఆలోచించింది.
మండలిలో బిల్లు తిరస్కరిస్తే వెంటనే మూడో రోజున అసెంబ్లీ సమావేశంలో బిల్లు ప్రతిపాదించి ఆమోదించాలని ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది. సీఆర్డీఏ బిల్లు ద్రవ్య బిల్లుగా ప్రతిపాదించాలని ప్రభుత్వం డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. అదే జరిగితే..ప్రతిపక్షాలు సీఆర్డీఏ బిల్లును వ్యతిరేకించినా.. 14 రోజుల్లోగా ఆ బిల్లు డీమ్డ్ టు బి యాక్సెప్టెడ్ గా పరిగణిస్తారు. దీని ద్వారా ప్రభుత్వం ఆలోచన ఇక ఆచరణ లోకి రానుంది. దీని ద్వారా ఏపీలో మూడు రాజధానులు అమల్లోకి రానున్నాయి. ఇక, సభలో అధికార..ప్రతిపక్షాల మధ్య అసలైన సమరం ప్రారంభం కానుంది.