బస్సుచార్జీలే ప్రధాన అస్త్రం, ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని, రేపటినుంచి ఏపీ అసెంబ్లీ...
ఆంధ్రప్రదేశ్ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఎముకలు కొరికే చలిలో ఏపీ అసెంబ్లీ సెగలు పుట్టించే అవకాశం ఉంది. ఇప్పటికే అస్త్రశస్త్రాలను అధికార, విపక్షాలు సిద్ధం చేసుకున్నాయి. సోమవారం నుంచి తొమ్మిదిరోజుల పాటు సభ జరగనుంది. కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెడతామని సంకేతాలు ఇచ్చింది.
బీఏసీలో..
సోమవారం అసెంబ్లీ సమావేశమవుతోంది. ప్రశ్నోత్తరాల సమావేశం అనంతరం బీఏసీ సమావేశం నిర్వహిస్తారు. సభ ఎన్నిరోజులు నడపాలి ? ఏయే అంశాలపై చర్చించాలనే అంశంపై డిస్కస్ చేస్తారు. 20 అంశాలపై అసెంబ్లీలో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతిపక్షం లేవనెత్తిన ప్రతి అంశంపై మాట్లాడేందుకు సిద్ధమని అధికార పక్షం చెబుతోంది.
చార్జీలే అస్త్రం
బస్సు చార్జీల పెంపు అంశాన్ని ప్రతిపక్షాల అస్త్రంగా మార్చుకోబోతున్నాయి. ప్రజలపై భారం ఏంటి అని నిలదీసే అవకాశం లభించింది. దీంతోపాటు సీఎం ఇంటి ఖర్చుపై జీవోపై కూడా సభలో దుమారం చెలరేగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై ప్రతిపక్షం సభలో లేవనెత్తే ఛాన్స్ ఉంది. అలాగే తమ పార్టీకి చెందిన వల్లభనేని వంశీ అనర్హత పిటిషన్ ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తామని టీడీపీ నేతలు చెప్తున్నారు.
ధీటుగా వైసీపీ..
సభలో అనుసరించాల్సిన వ్యుహంపై టీడీపీ పావులు కదుపుతుండగా.. అధికార పార్టీ కూడా అదే స్థాయిలో వ్యుహరచన చేస్తోంది. టీడీపీ ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకోనే అంశంపై ఫోకస్ చేసింది. ఆ పార్టీ నుంచి నాలుగు నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారితే టీడీపీ.. ప్రధాన ప్రతిపక్ష హోదా పోతోంది. అలా అపోజిషన్ లేకుండా చేయాలని వైసీపీ అడుగులేస్తోంది.
బిల్లులకు ఆమోదం
కీలక బిల్లులను కూడా ప్రవేశపెడతామని సర్కార్ చెబుతోంది. ఆర్టీసీ చార్జీల రెగ్యులేటరి కమిషన్ ఏర్పాటు బిల్లును ప్రవేశపెడతామని ఏపీ సర్కార్ స్పష్టతనిచ్చింది. మద్యంపై కఠినచర్యలు తీసుకొనేందుకు చట్టం రూపొందించనుంది. విక్రయాల్లో అక్రమాలపై ఫోకస్ చేసింది. మద్యం అక్రమ నిల్వ నివారణకు చట్టం చేస్తామని ప్రభుత్వ వర్గాలు సంకేతాలు ఇచ్చాయి.