ఏపీ అసెంబ్లీ సమావేశాలు ..అత్యాచారం చేస్తే మరణ శిక్ష .. కొత్త చట్టం యోచన
తెలుగు రాష్ట్రాలనే కాదు, యావత్ దేశాన్ని అత్యాచారాలు వణికిస్తున్నాయి. మృగాళ్ళు చేస్తున్న పైశాచిక కృత్యాలకు మహిళలు బలైపోతున్నారు. తాజాగా షాద్ నగర్ సమీపంలో దిశ సామూహిక అత్యాచారం, హత్య ఘటన, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు లో భాగంగా జరిగిన దిశ హత్య నిందితుల ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. మహిళలకు రక్షణ లేదు అన్న చర్చ ప్రధానంగా జరుగుతుంది.ఇక ఇదే సమయంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోనుంది.
ఏపీలో మహిళల రక్షణకు కొత్త చట్టం చెయ్యటానికి ఏపీ ప్రభుత్వం ఆలోచన
ఇక ఈ నేపథ్యంలో నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో దీనిపై కీలక చర్చలు జరపాలని,మహిళల రక్షణకు కొత్త చట్టాన్ని తీసుకురావాలని ఏపీ సర్కార్ భావిస్తుంది. ఏపీలో విప్లవాత్మకమైన నిర్ణయంతో మహిళల రక్షణ కోసం కఠినమైన చట్టాలను రూపొందించాలని భావిస్తోంది ఏపీ ప్రభుత్వం. మహిళలపై అత్యాచారాలకు పాల్పడితే మరణ శిక్ష విధించేలా సరికొత్త చట్టం తేవడానికి రాష్ట్ర ప్రభుత్వ రంగం సిద్ధం చేసింది.
అసెంబ్లీ సమావేశాల్లో కార్యరూపం ఇవ్వాలని కసరత్తు
నేటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లోనే దీనికి కార్యరూపం ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది. ఇలాంటి కేసుల విచారణ నెలల తరబడి సాగకుండా మూడు వారాల్లో పూర్తి చేసి నిందితులకు రోజుల వ్యవధిలోనే శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్న క్రమంలో అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై కీలక చర్చ జరగనుంది.చాలా సందర్భాల్లో నేరం జరిగిన చాలా సంవత్సరాల వరకు కూడా దోషులకు శిక్ష పడకపోవడం,ఈ తరహా ఘటనలు పదే పదే పునరావృతం అవుతుండడంతో వైసిపి ప్రభుత్వ హయాంలో ఇటువంటి ఘటనలకు చెక్ పెట్టడానికి నిర్ణయం తీసుకుంది.
అత్యాచారాలకు పాల్పడితే మరణ శిక్ష
అందులో భాగంగానేఈ కేసుల విచారణకు జిల్లాజడ్జితో కూడిన జిల్లాకో ప్రత్యేక కోర్టు, అవసరమైన పక్షంలో ఇంకో కోర్టు కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మహిళల భద్రతకు సంబంధించి ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలకు మరింత పదును పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మహిళలపై అత్యాచారాలకు పాల్పడితే మరణ శిక్ష విధించేలా కఠినమైన చట్టాలను అమల్లోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయమై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
దిశా ఘటనతో స్పందించిన ఏపీ సర్కార్ .. అసెంబ్లీలో చర్చ, కీలక చట్టం
నలుగురు మానవ మృగాల పైశాచిక దాడికి బలైపోయిన దిశ సంఘటన నేపధ్యంలో ఏపీలో కొత్త విధానానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఏపీలో కూడా జీరోఎఫ్ఐఆర్ విధానం అమలులోకి తీసుకువచ్చిన ప్రభుత్వం తొలి కేసును కూడా ఛేదించింది. ఈ మేరకు ప్రభుత్వ ఆదేశాలతో డీజీపీ గౌతమ్ సవాంగ్ అధికారులకు జీరో ఎఫ్ ఐ ఆర్ అమలు చెయ్యాలని చెప్పారు . ఇక ఈ ఒక్క నిర్ణయమే కాదు , నేటి నుండి జరగనున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో అత్యాచారాల విషయంలో కూడా కొత్త చట్టం తీసుకురావాలని యోచిస్తున్నారు.