వారిని తొలగిస్తేనే అసెంబ్లీకి, కలవడం ఇష్టంలేకే లేఖ: బాబు-కోడెలపై వైసీపీ
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బుధవారం బహిరంగ లేఖ రాశారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని తమను స్పీకర్ కోరారని అందులో పేర్కొన్నారు. కానీ పార్టీ మారిన 22 మంది శాసన సభ్యులను ఫిరాయింపు చట్టం నుంచి స్పీకర్ ఏళ్ల తరబడి కాపాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వీడియో ఆశ్చర్యపరుస్తుంది: విమానం నుంచి సరస్సులోకి చేపల వర్షం!
నలుగురు మంత్రులు, ఫిరాయింపు ఎమ్మెల్యేలను పదవుల నుంచి తొలగిస్తే రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతామని వారు చెప్పారు. స్పీకర్ కోడెల శివప్రసాద రావు పైన వైసీపీ విప్ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
22 మందిని అనర్హులుగా ప్రకటించాలి
తమ పార్టీకి చెందిన 22 మంది శాసన సభ్యులను అనర్హులుగా ప్రకటించాలని పిన్నెల్లి.. స్పీకర్ను డిమాండ్ చేశారు. వాళ్లను అనర్హులుగా ప్రకటించే వరకు తాము అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేది లేదని తేల్చి చెప్పారు. ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన వేటు వేసే ధైర్యం సభాపతికి లేదని ధ్వజమెత్తారు.
కలవడం ఇష్టం లేకే బహిరంగ లేఖ
సభాపతి స్థానానికి అవమానం చేసే విధంగా స్పీకర్ కోడెల శివప్రసాద రావు వ్యవహరిస్తున్నారని పిన్నెల్లి విమర్శించారు. స్పీకర్ సీటుకు గౌరవం కలిగేలా కోడెల వ్యవహరించాలని హితవు పలికారు. స్పీకర్ను కలవడం ఇష్టం లేకే తాము బహిరంగ లేఖ ద్వారా నిరసన తెలుపుతున్నామని చెప్పారు.
చంద్రబాబు ఆదేశాల మేరకే
ఐదు కోట్ల మందికి సంబంధించిన శాసన సభను నడిపే వ్యక్తిగా కోడెల సరిపోరాని పిన్నెల్లి అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు స్పీకర్ సభను నడుపుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
22 మందిపై చర్యలు, ఆ మంత్రులను తొలగిస్తేనే అసెంబ్లీకి
చంద్రబాబు నాయుడు తీరు ముఖ్యమంత్రి పదవికి కళంకం తెచ్చేలా ఉందని మరో ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. స్పీకర్ పదవికి కళంకం తెచ్చిన ఏకైక వ్యక్తి కోడెల అన్నారు. తెలుగుదేశం పార్టీ భావాలతో నిండిన వ్యక్తి స్పీకర్గా ఏమాత్రం సరిపోరని చెప్పారు. తమ పార్టీ నుంచి గెలిచిన నలుగురిని మంత్రి పదవుల నుంచి తొలగిస్తేనే రేపటి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతామని చెప్పారు. కాగా 2014లో వైసీపీ నుంచి గెలిచిన 22 మంది టీడీపీలో చేరారు. అందులో అఖిలప్రియ, సుజయ కృష్ణ రంగారావు, అమర్నాథ్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డిలు మంత్రులు అయ్యారు.