చంద్రబాబు.. డోంట్ టాక్ రబిష్: నా అధికారాల్ని ప్రశ్నించడానికి నువ్వెవరు?నిప్పులు చెరిన స్పీకర్
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి 'వికేంద్రీకరణ బిల్లు'పై చర్చ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాం కనీవినీ ఎరుగని రీతిలో ఆగ్రహావేశాలన్ని ప్రదర్శించారు. రాజధాని భూముల అక్రమాలపై విచారణకు ఆదేశించే అధికారం స్పీకర్ కు లేదని ప్రతిపక్ష నేత చంద్రబాబు అనడం సభలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఆవేశంతో ఊగిపోయిన స్పీకర్.. 'చెత్తవాగుడు ఆపెయ్..'అంటూ చంద్రబాబుపై ఫైరయ్యారు.
అసలేం జరిగిందంటే..
వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. అమరావతి ప్రాంతంలో టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు ఆయన అనుచరులు, కుటుంబీకులు పెద్ద ఎత్తున భూఅక్రమాలకు పాల్పడ్డారని, ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా కొనుగోళ్ల వ్యవహారం నడిచిందని లెక్కలతో సహా వివరించారు. మంత్రి చెప్పినవన్నీ అబద్ధాలేనని టీడీపీ ఎమ్మెల్యేలు కూడా గట్టిగానే నినాదాలు చేశారు. మంత్రి ప్రసంగం పూర్తయిన తర్వాత స్పీకర్ మాట్లాడుతూ.. రెండు వైపులవాళ్లు భిన్నవాదనలు వినిపించారుకాబట్టి.. వాటిని జనం టీవీల్లో చూశారుకాబట్టి.. నిజానిజాలు బయటపడేలా ఇన్ సైడర్ ట్రేడింగ్, భూముల అక్రమాలపై సభాపరమైన విచారణకు ఆదేశిస్తున్నానని ప్రకటించారు. అంతలోనే చంద్రబాబు చేసిన కామెంట్ వివాదాస్పదమైంది.
సెన్సాఫ్ హ్యూమర్ ఉందా?
స్పీకర్ ప్రసంగానికి టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అడ్డు తగిలారు. దీంతో ఆగ్రహించిన స్పీకర్.. ‘సెన్సాఫ్ హ్యూమర్ ఉందా' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూముల అక్రమాలపై సభలో చర్చ జరుగుతున్నందున దానిపై జోక్యం చేసుకునే అధికారం తనకుందన్న స్పీకర్... ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ జరపాలంటూ సీఎం జగన్ కు సూచించారు. అంతలోనే ప్రతిపక్ష నేత చంద్రబాబు జోక్యం చేసుకుంటూ.. ‘‘విచారణకు ఆదేశించే అధికారం మీకు ఎవరిచ్చారు?''అని ప్రశ్నించడంతో స్పీకర్ ఒక్కసారే భగ్గుమన్నారు.
నా అధికారాల్ని ప్రశ్నించడానికి నువ్వెవరు?
‘‘డోంట్ టాక్ రబ్బిష్.. ఒక స్పీకర్ గా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించే అధికారాలు నాకున్నాయి. సభాపతి అధికారాల్ని ప్రశ్నించడానికి నువ్వెవరు? లిమిట్స్ లో ఉండటం నేర్చుకోండి.. హద్దు మీరి మాట్లాడొద్దు.. భూముల అక్రమాలపై విచారణకు ఆదేశిస్తే మీరెందుకు ఉలిక్కి పడుతున్నారు? ఇవాళ సభలో మంత్రులు చెప్పిన విషయాలు నిజమో, కాదో ప్రజలకు తెలియాలి. దోషులు ఎవరో బయటపడాలి. అందుకే విచారణకు ఆదేశించా''అని స్పీకర్ మండిపడ్డారు.
సీఎం రియాక్షన్.. స్పీకర్ జడ్జిలాంటివారు..
శాసనసభకంటూ ప్రత్యేక ఐడెంటిటీ, ప్రత్యేక అధికారాలు ఉన్నాయని, ఆ అధికారాల ప్రకారం స్పీకర్ అనే వ్యక్తి జడ్జిలా వ్యవహరిస్తారని సీఎం జగన్ అన్నారు. స్పీకర్ కు అధికారాలు లేవనడం కరెక్ట్ కాదని, ఇన్ సైడర్ ట్రేడింగ్, భూముల అక్రమాల అంశంపై స్పీకర్ ఆదేశాలను ప్రభుత్వం తప్పనిసరిగా పాటిస్తుందని, ఆ మేరకు విచారణకు ఆదేశిస్తామని సీఎం తెలిపారు.
బాబు క్షమాపణ చెప్పాలి..
స్పీకర్ పోస్టును కించపర్చేలా కామెంట్లు చేసిన చంద్రబాబు వెంటనే క్షమాపణలు చెప్పాలని మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. చంద్రబాబుకు మొదటి నుంచి స్పీకర్ అన్నా, అసెంబ్లీ అన్నా గౌరవం లేదని, ఇవాళ సభాపతినే దూషించే స్థాయికి దిగజారడం అవమానకరమని, 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో చంద్రబాబుకు కొంచెమైనా బుద్ధి నేర్చుకోలేదని బొత్స మండిపడ్డారు.