12నుండి జగన్ సీఎంగా మొదటి అసేంబ్లీ సమావేశాలు: నోటిఫికేషన్ విడుదల.. సమావేశాలు సాగేదిలా..
ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తరువాత తొలి అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 12వ తేదీ నుండి ప్రారంభం కానున్నా యి. ఈ మేరకు గవర్నర్ నరసింహన్ నోటిఫికేషన్ జారీ చేసారు. 13న నూతన స్పీకర్ ఎన్నిక జరగనుంది. 14న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనేది బిఏసీ సమావేశం లో నిర్ణయం తీసుకోనున్నారు.
12వ తేదీ నుండి అసెంబ్లీ..
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తొలి అసెంబ్లీ సమావేశాలు ఈనెల 12వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. ఇందు కోసం 12వ తేదీ ఉదయం 11.05 గంటలకు ముహూర్తంగా నిర్ణయించారు. తొలి రోజున ప్రొటెం స్పీకర్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అదే రోజు స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేస్తారు. మిగిలిన సభ్యులతో 13వ తేదీన ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అది పూర్తయిన తరువాత కొత్త స్పీకర్ ఎన్నిక జరగనుంది. టీడీపీకి సంఖ్యా బలం లేకపోవటంతో వైసీపీ ప్రతిపాదించే అభ్యర్ది ఏకగ్రీవంగా ఎన్నిక కావటం లాంఛనమే. ఇక, 14వ తేదీన ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించనున్నారు. ఆ తరువాత సభ ఎన్ని రోజులు నిర్వహించాలనేది బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.
స్పీకర్ ఇప్పటికే ఖరారు..
తొలుత సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు విజయనగరం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి చిన అప్పల నాయుడు పేరును ప్రొటెం స్పీకర్గా జగన్ ఖరారు చేసారు. ఆయన సమావేశాల ముందు రోజు గవర్నర్ వద్ద ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తరువాత కొత్త స్పీకర్ ఎన్నికయ్యే వరకూ ఆయన కొనసాగుతారు. ఇక స్పీకర్గా బీసీ వర్గానికి చెందిన వారికి ఇవ్వాలని..అందునా ఉత్తరాంధ్రకు ఇవ్వాలని జగన్ ఇప్పటికే నిర్ణయించినట్లు సమాచారం. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నేతలు ధర్మాన ప్రసాద రావు లేదా తమ్మినేని సీతారాం వీరిలో ఒకరు స్పీకర్ అయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. ఆనం రామనారాయణ రెడ్డి పేరు వినిపిస్తున్నా..ఉత్తరాంధ్రకు స్పీకర్ పదవి ఇవ్వాలని జగన్ నిర్ణయంగా చెబుతున్నారు. కొత్త స్పీకర్ 13న ఏకగ్రీవంగా బాధ్యతలు స్పీకరించనున్నారు. ఇక, తరువాతి సమావేశాల్లో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉండే అవకాశం ఉంది. డిప్యూటీ స్పీకర్గా రాయలసీమ ప్రాంతానికి చెందిన మహిళకు కేటాయించనున్నట్లు సమాచారం.
బీఏసీ సమావేశంలో నిర్ణయం..
సభ ఎన్ని రోజులు నిర్వహించాలనేది బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు. 13న స్పీకర్ ఎన్నిక ముగిసిన తరువాత స్పీకర్ అధికారికంగా బీఏసీ సభ్యులను ప్రకటించనున్నారు. 14న గవర్నర్ ప్రసంగం అనంతరం సభ్యులు సమావేశమై సభా నిర్వహణ..అజెండా పైనా నిర్ణయం తీసుకోనున్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చ..ముఖ్యమంత్రి సమాధానం వరకే ఈ సమావేశాలు పరిమితమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ నెలాఖరు నుండి బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి.