హీరో అనుకుంటున్నావా? ఒళ్లు జాగ్రత్త.. నల్లచొక్కాల వెనుక మర్మం ఇదే.. లోకేశ్-బాబుపై వైసీపీ ధ్వజం..
ప్రతిపక్ష టీడీపీ నేతల వరుస అరెస్టులతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కిన తరుణంలోనే ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కీలక అంశాలతో కూడిన గవర్నర్ ప్రసంగం తర్వాత.. స్పీకర్ చాంబర్ లో జరిగిన బీఏసీ సమావేశంలో.. సభను రెండు రోజులపాటు జరపాలనే నిర్ణయానికి వచ్చారు. అధికారపక్షం వ్యవహరిస్తోన్న తీరుకు నిరసనగా టీడీపీ ఎమ్మెల్యేలంతా నల్ల చొక్కాలతో సభకురాగా.. ఆ రంగు దుస్తులు ధరించడం వెనుక మర్మం వేరే ఉందంటూ వైసీపీ విమర్శలకు దిగింది. అనంతపురం పర్యటనలో టీడీపీ నేత నారా లోకేశ్ చేసిన కామెంట్లపై మంగళవారం కూడా రచ్చ కొనసాగింది..
బిన్ లాడెన్ తరహాలో అచ్చెన్న అరెస్టు.. వైసీపీ ఎంపీ అనూహ్య కామెంట్లు.. కడప జైలుకు లోకేశ్..
అసలేం జరిగిందంటే..
‘‘151మంది కాలకేయ సైనికుల్ని.. బాహుబలిలాగా ఎదుర్కొంటున్నందుకే అచ్చెన్నాయుడిపై కక్షకట్టారు. ముందేమో రూ.150కోట్ల అక్రమాలన్నారు.. ఎఫ్ఐఆర్ లో రూ.3 కోట్లు చూపించారు. ఒక బీసీ నాయకుడిపై ఇంత దారుణంగా దొంగకేసులు పెడుతోంటే వైసీపీలోని బీసీ నాయకులకు సిగ్గనిపించడంలేదా? మీకు దమ్మూధైర్యం లేదా?''అంటూ టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ చేసిన కామెంట్లపై వైసీపీ తీవ్రఅభ్యంతరం వ్యక్తం చేసింది. లోకేశ్ మాటలు ముమ్మాటికీ బీసీలను అవమానించేలా ఉన్నాయని, ఇందుకాయన క్షమాపణలు చెప్పాలని అధికార పార్టీ నేతలు డిమాండ్ చేశారు.
నువ్వు హీరోవా?
వైఎస్ రాజారెడ్డి దగ్గర్నుంచి వైఎస్ జగన్ దాకా టీడీపీని ఏమీ పీకలేకపోయారంటూ లోకేశ్ చేసిన కామెంట్లపై హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఘాటుగా స్పందించారు. ‘‘లోకేశ్.. నువ్వేమైనా హీరో అనుకుంటున్నావా? ఒళ్లు దగ్గరపెట్టుకో.. మరీ ముఖ్యంగా అనంతపురం వచ్చినప్పుడు నోటిని కూడా అదుపులో పెట్టుకో.. జగన్ ను విమర్శిస్తే నువ్వు హీరోవి కాలేవు. దశాబ్దాల కిందటే కులాంతర వివాహాలు చేసుకున్న చరిత్ర రాజారెడ్డి కుటుంబానిది. ఆయన మనవడిగా జగన్ ఇప్పుడు పార్టీలకు అతీతంగా ప్రజలకు మేలులు చేస్తున్నారు. అలీబాబా-అరడజను దొంగల్లా తయారయ్యారు మీరు'' అని ఎంపీ ఫైరయ్యారు.
అందుకే మాలోకం అంటారు..
లోక్ సభ ఎంపీ గోరట్లతోపాటు వైసీపీకే చెందిన రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి సైతం లోకేశ్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జేసీ నివాసంలో మీడియాతో మాట్లాడుతూ లోకేశ్ ఒకటిరెండు చోట్ల తడబడటాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘లోకేశ్ ను మాలోకం అనేది అందుకే. ఆయన వీడియో క్లిప్పింగ్స్ చూస్తే.. జేసీ కుటుంబాన్ని ఓదార్చడానికెళ్లాడా? లేక వీళ్లకు తగిన శాస్తి జరిగిందని తిట్టడానికి వెళ్లాడా? అనే అనుమానం కలుగుతోంది''అని వ్యాఖ్యానించారు.
Recommended Video
నల్ల చొక్కాల వెనుక..
అసెంబ్లీ సమావేశాల తొలిరోజైన మంగళవారం టీడీపీ చీఫ్ చంద్రబాబు సహా పార్టీ ఎమ్మెల్యేలంతా నల్లచొక్కాలతో సభకు వచ్చారు. వైసీపీ సర్కారు అరాచకాలపై నిరసన తెలిపేందుకే ఈ విధానమని టీడీపీ ఇదివరకే స్పష్టం చేసింది. అయితే, బాబు అండ్ కో నల్ల రంగును ఎంచుకోవడం వెనుక మర్మం వేరే ఉందని వైసీపీ ఎంపీ విజయసాయి అన్నారు. ‘‘నల్ల ధనం మీద విచారణల వద్దని చెప్పడానికే నల్ల చొక్కా వేసుకున్నావా? నాయుడూ వాటే కలర్సెన్స్!''అని ఎద్దేవా చేశారు.