అచ్చెన్నాయుడు కోరారు..జగన్ అంగీకరించారు: అసెంబ్లీలో 12న బడ్జెట్: 30వ తేదీ వరకు సమావేశాలు..!
ఏపీ శాసనసభా సమావేశాలు గురువారం నుండి ప్రారంభం కానున్నాయి. సమావేశాల నిర్వహణ పైన స్పీకర్ సీతారం బీఏసీ సమావేశం ఏర్పాటు చేసారు. ఈ నెలాఖరు వరకు సమావేవాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈనెల 12న సాధారణ..వ్యవసాయ బడ్జెట్లను ప్రవేశ పెట్టనున్నారు. మొత్తం 14 పని దినాల్లో సభ కొనసాగనుంది. అదే విధంగా ప్రభుత్వ బిల్లులను ప్రవేశ పెట్టనున్నారు. అదే షెడ్యూల్ ప్రకారం శాసనమండలి సమావేశాలు జరగనున్నాయి.
బీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి..
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలి సారి పూర్తి స్థాయి అసెంబ్లీ సమావేశాలు గురువారం నుండి ఆరంభం కానున్నాయి. ఈ నెల 12న శాసనసభలో ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ 2019-20 వార్షిక బడ్జెట్ను ప్రవేశ పెట్టను న్నారు. ఆ వెంటనే వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ను సభలో ప్రవేశ పెడతా రు. శాసనసభా సమావేశాల నిర్వహణ పైన స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. దీనిలో తీసుకున్న నిర్ణయం మేరకు 10వ తేదీ నుండి ప్రారంభమయ్యే సమావేశాలు ఈ నెలఖరు అంటే 30వ తేదీ వరకు జరపాలని నిర్ణయించారు. అందులో 14 పని దినాలు ఉంటాయి. శని, ఆది వారాలు సభకు సెలవగా నిర్ణయించారు. ఈ బీఏసీ సమావేశంలో ప్రభుత్వం నుండి ముఖ్యమంత్రి జగన్..మంత్రి బుగ్గన రాజేంద్రనాద్, చీఫ్విప్ శ్రీకాంత రెడ్డి హాజరు కాగా..టీడీపీ నుండి అచ్చంనాయుడు హాజరయ్యారు.
టీడీపీ డిమాండ్ చేసిన అంశాలు ఇవే...
శాసనసభా సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలను కొన్నింటిని టిడిపి డిమాండ్ చేసింది. తాము డిమాండ్ చేసే అంశాలను సైతం అజెండాలో చేర్చాలని బీఏసీ సమావేశంలో అచ్చంనాయుడు ప్రతిపాదించారు. శాంతి భద్రతలు .. విత్తన, కరువు సమస్య.. ప్రాజెక్టుల గురించి చర్చ జరపాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్ తన స్పందనగా ఏ అంశం పైనైనా చర్చకు సిద్దమని..సభలో సరైన విధానం చర్చకు ముందుకు వస్తే ఖచ్చితం ఏ అంశం పైన అయినా..ఎంత సేపు అయినా చర్చించటానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని స్పష్టం చేసారు. దీంతో..12న బడ్జెట్ ప్రవేశ పెట్టిన తరువా త, 15,16, 17 తేదీల్లో బడ్జెట్ పైన చర్చ జరుగుతుంది. చివరగా ఆర్డిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాద్ సమాధానం ఇస్తారు. తమకు తగిన సమయం కావాలని అచ్చంనాయుడు స్పీకర్ను అభ్యర్దించగా..నిబంధనల ప్రకారమే నడుచుకుంటామ ని..అందరికీ అవకాశం ఉంటుందని స్పీకర్ హామీ ఇచ్చారు.
వైసీపీ నుండి ప్రతిపాదించిన అంశాలు..
బీఏసీ సమావేశంలో వైసీపీ నుండి అనేక అంశాల మీద చర్చ కోసం ప్రతిపాదన చేసారు. విత్తనాల సమస్య, రాజధాని అంశం, కరకట్ట మీద అక్రమ నిర్మాణాలు, ప్రాజెక్టులు, శాంతి భద్రతలు, కేంద్ర సాయం, రాజధాని, కరువు, రాష్ట్రంలో జరిగిన అవినీతి, రైతు సంక్షేమం వంటి వాటి పైన చర్చ సాగాలని వైసీపీ కోరింది. మొత్తం 14 రోజుల పాటు సమావేశం జరగాలని నిర్ణయించటం అన్ని సమస్యలను చర్చిద్దామని..ప్రభుత్వం నుండి కీలక బిల్లులు సైతం ఉన్నాయని మంత్రులు వివరించారు. శాసన మండలిలోనూ బీఏసీ ఛైర్మన్ అధ్యక్షతన సమావేశమైంది. ఇదే విధంగా 10వ తేదీ నుండి 30వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.