జగన్ గాడిదలు కాస్తున్నాడా? కేంద్రాన్ని ఒప్పించాడా? -పోలవరం ఘనత వైఎస్సార్దికాదు: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ వరదాయిని పోలవరం విషయంలో వైసీపీ అతి నీచమైన రాజకీయాలు చేస్తోందని, ప్రాజెక్టు ఎప్పుడు, ఎలా పూర్తి చేస్తారో చెప్పకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ డొంకతిరుగుడుగా మాట్లాడుతున్నారని ప్రతిపక్ష నేత, టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్ర అసెంబ్లీలో పోలవరంపై చర్చ సందర్భంగా సభకు అడ్డుపడుతున్నారంటూ టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేసిన తర్వాత, అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధంచి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఏమన్నారో ఆయన మాటల్లోనే..
ఏడాదిన్నరగా ఏం చేస్తున్నారు?
‘‘పోలవరంపై ఏది మాట్లాడినా, టీడీపీ హయాంలో అవినీతి జరిగిందని వైసీపీ ఆరోపణలు చేస్తోంది. అదే నిజమైతే ఇప్పటిదాకా ఎందుకు నిరూపించలేకపోయారు? యంత్రాంగమంతా మీ చేతుల్లోనే ఉంది కదా? మరి అవినీతి వ్యవహారం తేల్చకుండా ముఖ్యమంత్రి జగన్ ఏడాదిన్నర కాలంగా గాడిదలు కాస్తున్నారా? తప్పుడు సమాచారం, నిరాధారమైన ఆరోపణలతో కాలయాపన చేస్తారా? నోటికొచ్చినట్లు మాట్లాడుతూ అవాస్తవాలు ప్రచారం చేస్తారా? అసలు టీడీపీనే లేకపోతే పోలవరం నిర్మణం సాధ్యమయ్యేదేనా? ఒక్కసారి గతాన్ని గుర్తుచేసుకోండి..
ఆ 16 ప్రాజెక్టుల గతే పోలవరానికి..
రాష్ట్ర విభజన తర్వాత.. కేంద్రంతో మాకున్న తత్సంబంధాల నేపథ్యంలో ఏడు ముంపు మండలాలను తీసుకురాకపోయుంటే పోలవరం నిర్మాణం సాధ్యమయ్యేదే కాదు. ప్రాజెక్టు నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా సమస్యలను అధిగమించింది మేమే. పోలవరంపై మెండైన ఆసక్తి ఉండబట్టే, నాపై ఉన్న గౌరవంతో నాటి నీతిఆయోగ్ వైస్ఛైర్మన్ పణగరియా.. పోలవరం నిర్మాణ బాధ్యతలు రాష్ట్రానికి అప్పగించారు. నిజంగా ఏపీకే గనుక ఆ ప్రాజెక్టు రాకపోయి ఉంటే.. దేశంలోని 16 జాతీయ ప్రాజెక్టులకు పట్టిన గతే పోలవరానిది అయ్యుండేది. కేంద్రం టేకప్ చేసిన 16 జాతీయ ప్రాజెక్టుల్లో ఈనాటికీ 30 శాతం పనులు కూడా పూర్తికాలేదు.
రివర్స్ టెండరింగ్తో భారీ నష్టం..
టీడీపీ హయాంలో పోలవరం నిర్మాణానికి కేంద్రం నిధులు ఇవ్వకపోయినా రాష్ట్రమే ఆ ఖర్చును భరించి రీయింబర్స్ చేసేలా ఎప్పటికప్పుడు నిధులు తెచ్చుకున్నాం. ఆ పని చేయకపోతే నిర్మాణం చాలా ఆలస్యమయ్యేది. బేసిగ్గా అవినీతిపరుడైన జగన్.. అందరిపైనా అదే ముద్ర వేయాలనుకుంటున్నాడు. గతంలో మేం వేసిన అంచనాలను తప్పుపట్టి.. మళ్లీ అవే అంచనాలతో రివర్స్ టెండరింగ్ నాటకాలు చేశారు. సదరు ప్రక్రియతో రాష్ట్రానికి భారీగా నష్టం వాటిల్లింది. పోలవరం నిర్వాసితులకు ఎకరాకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని వాగ్దానం చేసి, దాన్నిప్పుడు గాలికొదిలేశారు.
పోలవరం వైఎస్సార్ ఘనత కాదు..
నీళ్లు లేకుండా విద్యుత్ ప్లాంట్ ఎందుకని నేను ప్రశ్నిస్తే సభ నుంచి సస్పెండ్ చేశారు. గోదావరి నీళ్లను తెలంగాణ మీదుగా శ్రీశైలానికి తెస్తామని జగన్ చెప్పినప్పుడు కూడా అది సాధ్యం కాదని నేను వాదించాను. సరిగ్గా నేను చెప్పినట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం ఇవాల వెనక్కి తగ్గింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో పోలవరం ప్రాజెక్టును కడుతూ, అక్కడ వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడమేంటి? వైఎస్ విగ్రహం పెడితే కేంద్రం ఊరుకుంటుందా? నిధులు ఆపేస్తుంది కదా? అసలు పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన ఘనత అప్పటి సీఎం అంజయ్యకే దక్కుతుందికానీ, వైఎస్సార్కు కాదు. నిధులపై కేంద్రాన్ని ఎలా ఒప్పిస్తారో, ప్రాజెక్టును ఎప్పటిలోగా పూర్తి చేస్తారో జగన్ స్పష్టత ఇవ్వాలి'' అని టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు.
Recommended Video
అసెంబ్లీలో చంద్రబాబు పాట -పడి పడి నవ్విన జగన్ -ఘోరమన్న స్పీకర్ -కీలక బిల్లులు పాస్