ఈ నెల 16 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. నోటిఫికేషన్ విడుదల..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 16వ తేదీ ప్రారంభం కానున్నాయి. ఆరోజు ఉదయం 10 గంటలకు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగంతో సమావేశాలు మొదలవుతాయి. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ విడుదల చేశారు.
గవర్నర్ ప్రసంగం అనంతరం బీఏసీ(బిజినెస్ అడ్వైజరీ కమిటీ)లో చర్చించి సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలన్నది నిర్ణయించనున్నారు. ఈ ఏడాది మార్చి నెలలో ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టినందున.. తాజా సమావేశాల్లో ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టి సభ ఆమోదం పొందనుంది.
అంతకుముందు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ సమావేశాలతో పాటు.. పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించి తీర్మానాలను ఆమోదించారు. కొత్తగా మరో సంక్షేమ పథకాన్ని తీసుకొచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్ చేయూత పేరుతో 45 ఏళ్ల నుండి 60 ఏళ్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఏడాదికి రూ.18,142 చొప్పున నాలుగేళ్లలో 75వేల వరకు ఆర్ధిక సహాయం అందించాలని నిర్ణయించింది. వచ్చే ఆగస్టు 12న ఈ పథకాన్ని ప్రారంభించాలని తీర్మానం చేశారు. అలాగే ఐదు దశల్లో రామాయపట్నం పోర్టు నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు.