అమరావతా? మజాకా?: నీటి కొలనులో అసెంబ్లీ.. కేంద్రంతో కయ్యానికి సంకేతమా?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని పరిపాలనా నగరం అమరావతిలో అసెంబ్లీ భవనానికి టవర్ డిజైన్కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. నీటి కొలను మధ్యలో 250 మీటర్ల వెడల్పు, 250 మీటర్ల పొడవుతో నార్మన్ ఫోస్టర్స్ సంస్థ రూపొందించిన అసెంబ్లీ డిజైన్కు చంద్రబాబు క్యాబినెట్ పచ్చజెండా ఊపింది. శనివారం రాత్రి వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఫోస్టర్స్ సంస్థ ప్రతినిధులు టవర్ డిజైన్తోపాటు వజ్రం డిజైన్పై ప్రజెంటేషన్ ఇచ్చారు. టవర్ ఆకృతికే మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు అమరావతిలో సచివాలయం, అసెంబ్లీ, శాసనమండలి, హైకోర్టు, ఇతర కట్టడాల నిర్మాణాలపై ఎడతెగని డిజైన్ల రూపకల్పనపై ద్రుష్టి సారించింది.
ఇంతకుముందు నార్మన్ ఫోస్టర్స్ సంస్థ రూపొందించిన డిజైన్లను తోసిపుచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు.. టాలీవుడ్ దర్శకుడు జక్కన్న 'రాజమౌళి' సలహాలు కూడా కోరారు. కానీ చివర్లో ఆయన ప్రతిపాదించిన డిజైన్ కూడా బాగా లేదని పక్కనబెట్టేశారు. ఇదిలా ఉంటే అమలులో ఉన్న ఇప్పటి వరకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిబంధనలను తోసిరాజని డీజీపీ నియామకంపై కొత్త చట్టం తయారుచేయడంపై చంద్రబాబు క్యాబినెట్ ద్రుష్టి సారించడం ఆసక్తికర పరిణామం. ఈ మేరకు ఏపీ పోలీస్ యాక్ట్ - 2017కు ఏపీ క్యాబినెట్ ఆమోదించడం ఇందులో కొసమెరుపు.
40 మీటర్ల ఎత్తున వ్యూ పాయింట్
250 మీటర్ల ఎత్తులో టవర్ ఆకారంలో నిర్మించే ఈ అసెంబ్లీ భవనం నాలుగు అంతస్తుల్లో ఉంటుంది. టవర్పైకి 40 మీటర్ల ఎత్తుకు వెళ్లిన తర్వాత వ్యూ పాయింట్ ఉంటుంది. అక్కడి నుంచి 217 చదరపు కిలోమీటర్ల రాజధాని నగరం మొత్తాన్ని వీక్షించవచ్చు. 70 మంది సందర్శకులు ఒకేసారి వ్యూపాయింట్కు వెళ్లి రాజధాని నగరాన్ని చూడొచ్చు. ఈ భవనాన్ని నీటి కొలనులో నిర్మిస్తారు. ఈ కొలను 125 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. టవర్ ప్రతిబింబం ఈ నీటిలో పడేలా డిజైన్ చేశారు. టవర్ కింది భాగంలో అసెంబ్లీ, శాసనమండలి, సెంట్రల్ హాల్, పరిపాలనా కేంద్రాల భవనాలు ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. అసెంబ్లీ భవనం మొత్తం 87 వేల చదరపు మీటర్ల ప్రాంతంలో ఉంటుండగా, నిర్మిత ప్రాంతం 7.8 లక్షల చదరపు అడుగుల్లో ఉంటుంది.
డిజైన్లపై సందేహాలు నివ్రుత్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం
ఈ భవనంపై పునరుత్పాదక విద్యుదుత్పత్తి వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. సూర్యకాంతి నుంచి విద్యుత్ను ఉత్పత్తి చేసే వ్యవస్థను కూడా నెలకొల్పుతారు. మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ టవర్ డిజైన్ను గురించి మంత్రులకు వివరించి అభిప్రాయాలు అడిగారు. అయితే చిత్రాల్లో డిజైన్ అంత ఆకర్శణీయంగా లేదని, పెద్ద చిత్రాలను చూపించాలని మంత్రులు కోరారు. డిజైన్లపై సోషల్ మీడియాలో అప్పుడే వ్యతిరేక ప్రచారం కూడా జరుగుతోందని, దీనిపై దృష్టి పెట్టి అనుమానాలు నివృత్తి చేయాలన్నారు. డిజైన్లపై మంత్రి నారాయణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ పూర్తిస్థాయి స్ట్రక్చరల్ డిజైన్లు ఇచ్చేందుకు ఆరు నుంచి ఎనిమిది వారాల సమయం పడుతుందని ఫోస్టర్స్ ప్రతినిధులు చెప్పినట్లు తెలిపారు. ఈ డిజైన్లు రాగానే టెండర్లు పిలిచి నిర్మాణ పనులు చేపడతామన్నారు.
2014 పోలీస్ యాక్ట్ చట్టానికి ఇలా సవరణ
సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ నియామకం కోసం ముగ్గురు సీనియర్ అధికారుల పేర్లతో నివేదిక తయారు చేసి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)కి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పంపాల్సి ఉంటుంది. 2014 పోలీస్యాక్ట్ ప్రకారం.. కేంద్రానికి ముగ్గురు సీనియర్ అధికారుల జాబితాను పంపించి అందులో ఒక పేరును ఎంపిక చేసుకునేవారు. తాజాగా ఏపీకి కొత్త డీజీపీ నియామకంపై ఆరుగురు సీనియర్ అధికారుల పేర్లతో కూడిన ప్రతిపాదనను కేంద్రానికి మూడుసార్లు పంపింది. అయితే ఆ ప్రతిపాదనను కేంద్రం వెనక్కి పంపింది. దీంతో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ చర్యలతో విసిగిపోయి.. 2014 చట్టానికి సవరణ తీసుకురావాలని భావించింది.
ఏపీ పోలీస్ యాక్టును కేంద్ర హోంశాఖ ఆమోదిస్తుందా?
డీజీపీ నియామకం అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పరిమితం చేసేందుకు వీలుగా 2017 పోలీస్యాక్ట్ ముసాయిదాను ఆమోదించింది. దీంతో 2014-పోలీస్యాక్ట్కి సవరణ చేస్తూ పోలీస్యాక్ట్-2017 ముసాయిదాను కొత్తగా తీసుకువచ్చింది. పోలీస్ యాక్ట్ 9 ఆఫ్ 2014ను సవరిస్తూ ఆర్డినెన్స్ తెచ్చి, తరువాత అసెంబ్లీలో చర్చించి పూర్తిస్థాయి సవరణకు ఆమోదం పొందాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ ఆర్డినెన్సుతో డీజీపీ నియామకాన్ని ఇకపై రాష్ట్ర ప్రభుత్వమే చేసేందుకు అవకాశం లభిస్తుంది. ఆలిండియా సర్వీసెస్(ఏఐఎస్) యాక్ట్ 1953కి లోబడి డీజీపీ పదవీకాలం కూడా నిర్ణయించే అధికారం ఆర్డినెన్స్ ద్వారా రాష్ట్రానికి ఉంటుంది. ముగ్గురు సీనియర్ పోలీసు అధికారులను ఎంపిక చేసుకొని అందులోంచి ఒకరిని డీజీపీగా ఎంపిక చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రస్తుతం డీజీపీగా సాంబశివరావు ఉన్నారు. ఆయన ఈ నెలాఖరులోగా పదవీవిరమణ చేయాల్సి ఉన్నది.