చంద్రబాబు పనైపోయింది.. ఇక తీహార్ జైలుకే: ఏపీ స్పీకర్ సీతారాం సంచలన వ్యాఖ్యలు
రాజ్యాంగ పదవుల్లో ఉన్నవాళ్లు కూడా రాజకీయ కామెంట్లు చేయడం ఈ మధ్య పరిపాటిగా మారింది. ముఖ్యంగా క్యాపిటల్ వివాదంతో రగిలిపోతోన్న ఆంధ్రప్రదేశ్ లో ఏకంగా అసెంబ్లీ స్పీకరే ప్రతిపక్ష నేతను ఉద్దేశించి బహిరంగంగానే కామెంట్లు చేయడం కామనైపోయింది. ఆదివారం శ్రీకాకుళంలో పర్యటించిన అసెంబ్ల స్పీకర్ తమ్మినేత సీతారాం మరోసారి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.
పచ్చకామెర్లోడికి..
రాజధాని మార్పుపై బోస్టన్ కమిటీ ఇచ్చిన నివేదికను చీల్చిచెండాడిన చంద్రబాబు.. అసలా కమిటీకి అథెంటిసిటీనే లేదని, పనికిమాలిన కమిటీ అని, పూర్తిగా అబద్ధాలు, అవాస్తవాల్ని రాశారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు కామెంట్లపై స్పందిస్తూ స్పీకర్ సీతారాం కూడా అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందనే సామెతను ఉటంకిస్తూ.. ఎప్పుడూ అబద్ధాలు మాట్లాడుతూ, అబద్ధాల్లోనే జీవించే చంద్రబాబుకు ఎవరేం మాట్లాడినా అబద్ధంలాగానే అనిపిస్తుందని సీతారాం చెప్పారు. బోస్టన్ కమిటీకి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏమాత్రం లేదని స్పీకర్ అన్నారు.
పోతానంటే వద్దనం..
బోస్టన్ కమిటీపై చంద్రబాబు వ్యాఖ్యలకు కౌంటరిచ్చే క్రమంలో స్పీకర్ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ‘‘నిజం చెప్పాలంటే ప్రతిపక్ష నేతగా చంద్రబాబు పూర్తిగా ఫెయిలయ్యారు. రాజకీయ నాయకుడిగానూ ఆయన పనైపోయింది. ఏం మాట్లాడుతున్నారో జనానికేకాదు.. ఆయనకు కూడా అర్థంకావట్లేదు. భూముల అక్రమాలపై అవసరమైతే జైలుకు కూడా వెళ్తానని బాబు పదే పదే అంటున్నారు. చాలా మంచింది. ఆయన జైలుకెళతానంటే మేము వద్దనం.. ఆపబోము కూడా. పైగా, తీహార్ జైలులో చాలా ఖాళీ ఉందని తెలిసింది. ఒకవేళ అక్కడికెళ్లినా మాకు అభ్యంతరం లేదు''అంటూ స్పీకర్ చంద్రబాబుకు చురకలేశారు.
రాజధాని అంశంలో స్పీకర్ దూకుడు
ఏపీ రాజధాని తరలింపు లేదా మూడు రాజధానుల వ్యవహారం తెరపైకి వచ్చిన తర్వాత అసెంబ్లీ స్పీకర్ తమ్మినేన సీతారాం తరచూ ఆవేశపూరిత కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. అమరావతి రాజధానిలా కాకుండా.. రాజస్థాన్ ఎడారిలా కనిపిస్తోందటూ ఒకసారి.. విశాఖపట్నంలో రాజధాని ఏర్పాటును ఎవడూ అడ్డుకోలేడంటూ మరోసారి అన్నారు. ఇప్పుడేకంగా చంద్రబాబుపైనే వ్యక్తిగత దాడికి దిగారు. బాబుపై స్పీకర్ విమర్శలపై టీడీపీ స్పందించాల్సిఉంది.