తుగ్లక్లకే తుగ్లక్లా: మీ ఎమ్మెల్యేలను కాపాడుకోండి చూద్దాం: చంద్రబాబుకు స్పీకర్ సవాల్!
శ్రీకాకుళం: అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తెలుగుదేశం పార్టీ వైఖరిపై భగ్గుమన్నారు. అమరావతిలో ప్రయాణిస్తుంటే ఎడారిలో వెళ్తున్నట్లుగా ఉందంటూ కొద్దిరోజుల కిందటే ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆయన మరోసారి అలాంటి వైఖరినే ప్రదర్శించారు. రాష్ట్రంలో మూడు చోట్ల రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనను తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యతిరేకించడాన్ని తప్పు పట్టారు.
దేశద్రోహులతో కేసీఆర్ మిలాఖత్: తెలంగాణ పోలీసులేమీ తక్కువ తినలేదు: ఎమ్మెల్యే రాజాసింగ్.. !
తుగ్లక్ లకే తుగ్లక్ లా..
శుక్రవారం ఆయన శ్రీకాకుళంలో విలేకరులతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నాయకులు తుగ్లక్ లకే తుగ్లక్ లా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న నాయకులందరూ తుగ్లక్ లేనని చెప్పారు. వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ఉత్తరాంధ్రకు చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సైతం స్వాగతిస్తున్నారని గుర్తు చేశారు. వారంతా పార్టీ ఫిరాయించినా ఆశ్చర్యపోనక్కర్లేదని అన్నారు.
జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలు
విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా ప్రకటించడం పట్ల వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని, చంద్రబాబు ఈ విషయం తెలియనంత అమాయకుడేమీ కాదని చెప్పారు. విశాఖపట్నానికి చెందిన నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణ, వాసుపల్లి గణేష్ కుమార్, గణబాబు సహా ముగ్గురు ఎమ్మెల్సీలు వైఎస్ జగన్ నిర్ణయానికి అనుకూలంగా మాట్లాడిన విషయం తెలిసిందే. వారంతా ఓ తీర్మానాన్ని సైతం రూపొందించారని తమ్మినేని సీతారాం చెప్పారు.
తీర్మానాన్ని తోసిపుచ్చగలరా?
ఈ తీర్మానాన్ని తోసిపుచ్చే సాహసానికి చంద్రబాబు పూనుకోగలరా? అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం అనంతరం తెలుగుదేశం పార్టీ ఫిరాయింపులను ఎదుర్కొంటోందని చెప్పారు. చంద్రబాబు నాయుడు ముందుగా తన ఎమ్మెల్యేలను కాపాడుకోవాలని సూచించారు. రాజకీయ మనుగడ కోసమే చంద్రబాబు తాపత్రయ పడుతున్నారని విమర్శించారు. మూడు రాజధానులను వ్యతిరేకించడం ద్వారా ఇటు ఉత్తరాంధ్రలో, అటు రాయలసీమలో ఆ పార్టీ మనుగడను కోల్పోయే ప్రమాదంలో పడిందని చెప్పారు.
దోపిడీకి పాల్పడిన వారే..
దోపిడికి పాల్పడి..భూములను కొల్లగొట్టిన నాయకులంతా ప్రస్తుతం అమరావతి ప్రాంత ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తమ్మినేని విమర్శించారు. విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో మూడు రాజధానుల అంశం రెఫరెండంగా మారుతుందని చెప్పారు. విశాఖను రాజధాని చేస్తామంటే అచ్చెన్నాయుడు గాబరా పడుతున్నారనీ..వారు ఎటువంటి హంగామా చేసినా జరిగేది జరుగక మానదని తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. టీడీపీ నేతల వారి అవినీతి బైటపడుతుందని ప్రజలను రెచ్చగొట్టి ఆందోళన చేయిస్తున్నారని ఆరోపించారు.