స్పీకర్ తమ్మినేనికి తప్పిన ప్రమాదం- ఆటోను ఢీకొట్టిన కాన్వాయ్
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. శ్రీకాకుళం జిల్లా వంజంగి సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో తమ్మినేని సురక్షితంగా బయటపడ్డారు. కాన్వాయ్లోని కారు స్వల్పంగా దెబ్బతింది. స్పీకర్ పర్యటనలో ప్రమాదం జరగడంతో జిల్లాకు చెందిన వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.
అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తన సొంత జిల్లా శ్రీకాకుళంలో విస్తృతంగా పర్యటిస్తుంటారు. ప్రజలతో మమేకం అవుతుంటారు. ఈ క్రమంలోనే ఇవాళ వంజంగి వెళ్తుండగా ఆయన కాన్వాయ్లో కారుకు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కాన్వాయ్కు ఆటో అడ్డుగా రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయి. దీంతో వీరిని స్ధానికంగా ప్రాధమిక చికిత్స అందించారు.
Recommended Video
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తమ్మినేని సీతారాం.. తాను సభాపతి అయినప్పటికీ ప్రజలు, నేతలతో సత్సంబంధాలు నెరుపుతుంటారు. జిల్లాలోని ఇతర వైసీపీ నేతలతో కూడా ఆయకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఎవరు ఏ కార్యక్రమానికి పిలిచినా కాదనకుండా హాజరవుతుంటారు. అలాగే జిల్లాకు చెందిన నేతలు, స్ధానికులు అమరావతి వచ్చినా ఎంత బిజీగా ఉన్నప్పటికీ వారిని కలుస్తుంటారు. దీంతో స్పీకర్ కాన్వాయ్కు ప్రమాదం జరిగిందని తెలిసి వారు ఆందోళన చెందారు. తమ్మినేని సురక్షితంగా బయటపడ్డారని తెలిసి ఆ తర్వాత ఊపిరిపీల్చుకున్నారు.