డెసిషన్ డే: ఉత్కంఠ..ఉద్రిక్తత: అసెంబ్లీలో ఈ రోజు ఏం జరగబోతోంది..!
మరి కొద్ది గంటల్లో ఏపీ రాజధాని భవితవ్యం తేలిపోనుంది. ఎలాగైనా మూడు రాజధానుల దిశగా అసెంబ్లీలో అధికారిక ఆమోదం పొందేందుకు ప్రభుత్వం వ్యూహాలు సిద్దం చేసింది. శాసనసభలో ఏం జరిగినా.. మండలిలో మాత్రం అడ్డుకుంటామని టీడీపీ చెబుతోంది. ఇక, మూడు రోజుల సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఇదే సమయంలో అమరావతి జేఏసీ..టీడీపీ ఛలో అసెంబ్లీ..జైల్ భరోకు పిలుపు నిచ్చారు. ముందస్తు నోటీసులు ఇచ్చిన పోలీసులు..అరెస్ట్ లు మొదలు పెట్టారు.
అమరావతి గ్రామాల్లో పది వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేసారు. అధికార వైసీపీ మూడు రాజధానుల నిర్ణయం..ప్రతిప క్ష టీడీపీ అమరావతి పైనే ముక్తకంఠంతో మద్దతివ్వాలని నిర్ణయించింది. తొలి రోజు కేబినెట్ తో సమావేశంతో ప్రారంభమయ్యే ప్రత్యేక సమావేశాలు మూడు రోజుల పాటు సాగే అవకాశం ఉంది. దీంతో... ఏపీలో ఇప్పుడు ఏం జరుగుతుందనే ఉత్కంఠ..అమరావతి ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొని ఉన్నాయి.
మూడు రాజధానుల దిశగా బిల్లు...
ప్రభుత్వం ఆలోచన ఏంటనేది శీతాకాల అసెంబ్లీ సమావేశాల ముగింపు రోజున ముఖ్యమంత్రి సభలోనే పరోక్షంగా స్పష్టం చేసారు. ఆ తరువాత ప్రభుత్వం నియమించిన జీఎన్ రావు ..బోస్టన్ కమిటీలు సైతం ఇదే ప్రతిపాదనకు అనుకూలంగా నివేదికలు ఇచ్చాయి. ఈ రెండింటి పైనా అధ్యయనం కోసం నియమించిన హైపవర్ కమిటీ సైతం నివేదిక సమర్పించింది. ఈ రోజు ఉదయం 9 గంటలకు సచివాలయంలోనే ఏపీ మంత్రివర్గం సమావేశం కానుంది. ఆ భేటీలో హైపవర్ కమిటీ నివేదికకు ఆమోదం తెలుపుతూ..మూడు రాజధానుల నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. అదే విధంగా సీఆర్ఢీఏ స్థానంలో తిరిగి వీజీటీఎం ను పునరుద్దరిస్తూ ప్రతిపాదన చేయనున్నారు. అధికార వికేంద్రీకరణ పైన అధికారిక నిర్ణయం తీసుకోనున్నారు. ఆ వెంటనే అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టేలా వ్యూహం సిద్దం చేసారు.
అసెంబ్లీలో బిల్లు ఈ రోజే ఆమోదం..
కేబినెట్ సమావేశం ముగిసిన వెంటనే అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో బీఏసీ సమావేశం జరగనుండి. అందులో సభా నిర్వహణ..అజెండా పైనా చర్చించనున్నారు. మూడు రోజుల పాటు సమావేశాలు జరిగేలా నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఇక, ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం అవుతుంది. ఇక్కడే అసలు ఘట్టం మొదలవుతుంది. అనుకున్నది సాధించేందుకు అధికార పక్షం... ఎలాగైనా అడ్డుకునేందుకు విపక్షం ఇప్పటికే వ్యూహాలు రచించుకున్నాయి. సభ ప్రారంభం కాగానే ప్రభుత్వం ఏపీ డీసెంట్రలైజేషన్ అండ్ ఈక్వల్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ రిజీయన్స్ బిల్-2020 పేరుతో కొత్త బిల్లును ప్రవేశ పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. నాలుగు జోన్లుగా 13 జిల్లాలను విభజించి బోర్డులు ఏర్పాటు దిశగా ప్రభుత్వం బిల్లులో ప్రతిపాదించనుంది. దీని పైన సభలో వెంటనే చర్చను ప్రారంభించి..అన్ని ప్రాంతాల నుండి ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఇవ్వనున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజే అసెంబ్లీలో బిల్లు ఆమోదించాలని ప్రభుత్వం భావిస్తోంది.
సభలో ఆమోదం పొందిన వెంటనే..
శాసనసభలో వైసీపీకి భారీ మెజార్టీ ఉంది. అదే సమయంలో జనసేన నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే సైతం ప్రభుత్వ నిర్ణయానికి ఇప్పటికే మద్దతు ప్రకటించారు. ఇక, టీడీపీ నుండి అభ్యంతరాలు వ్యక్తం అయినా తమకున్న బలంతో శాసనసభలో బిల్లు ఆమోదం పొందేలా వైసీపీ ముందుకే వెళ్లనుంది. ఈ రోజే శాసనసభలో ఆమోద ప్రక్రియ పూర్తి చేసి..మంగళవారం శాసనమండలిలో బిల్లును ప్రవేశ పెట్టే విధంగా వ్యూహం సిద్దం చేసారు. మంగళవారం ఉదయం 11 గంటలకు శాసన మండలి సమావేశం కానుంది. పెద్దల సభలో తమదే పైచేయి కావడంతో సర్కారు ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయాలని విపక్షం భావిస్తోంది. అదే జరిగితే ఏం చేయాలన్న అంశంపై అధికార పక్షం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను మండలి ఆమోదించని పక్షంలో... బుధవారం మరోమారు ఈ బిల్లులను శాసనసభలో ఆమోదించి, తిరిగి మండలికి పంపించాలని భావిస్తున్నారు. అప్పుడు... ఆ బిల్లులను మండలి తోసిపుచ్చినా ఒరిగేదేమీ ఉండదు. దీంతో..తాము అనుకున్న నిర్ణయానికి ప్రభుత్వం ఆచరణ రూపంలో కి తీసుకొచ్చే విధంగా పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.