ఏపీ అసెంబ్లీ రెండు రోజులే.!మీడియాను అనుమతించేది లేదన్న వైసీపి ప్రభుత్వం.!
అమరావతి/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు భిన్నంగా జరగనున్నాయి. అసెంబ్లీ సమావేశాలు రెండు రోజులకు కుదించాలని నిర్ణయించారు ఏపి సీఎం. ఉభయ సభల సమావేశాలను ఈసారి కేవలం 2 రోజులకే కుదించారు. మొదటి రోజు గవర్నర్ ప్రసంగం,అదే రోజు ధన్యవాద తీర్మానం ఉంటాయని సమాచారం.
Recommended Video
భిన్నగా జరగనున్న ఏపి అసెంబ్లీ సమావేశాలు..
అంతేకాదు, రాష్ట్ర బడ్జెట్ను కూడా అదే రోజు ప్రవేశపెట్టే విధంగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించినట్టు తెలుస్తోంది. ఆదే రోజు బడ్జెట్కు సభామోదం పొంది, మరుసటి రోజు కొన్ని బిల్లులు ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. సాధారణ జనజీవనాన్ని సమూలంగా మార్చేసిన కరోనా, తన ప్రతాపాన్ని ఇపుడు చట్టసభలపై కూడా చూపిస్తోంది. ఈనెల 16 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో ప్రత్యేక ఆంక్షలు విధించారు. కరోనా నేపథ్యంలో ఈ ఆంక్షలు పెట్టినట్టు అసెంబ్లీ కార్యదర్శి తెలపగా, ఇందులో అసెంబ్లీ మీడియా పాయింట్ ను రద్దు చేయడం సంచలన నిర్ణయంగా తెలుస్తోంది.
కేవలం ప్రజాప్రతినిధులు మాత్రమే హాజరు..
అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటలు, చర్చలు, వాగ్వాదాలు సర్వసాధారణంగా చోటుచేసుకుంటాయి. వీటిపై నేతలు బయటకు వచ్చి మీడియా పాయింట్ వద్ద తమ అభిప్రాయాన్ని, తామె చెప్పిన అంశాన్ని అధికార పక్షంగాని, ప్రతిపక్షంగానీ ఎలా వక్రీ2కరించే ప్రయత్నం చేసిందో వ్యక్తపరుస్తుంటారు. అసెంబ్లీ బయట దర్శనమిచ్చే ఇలాంటి సన్నివేశాలన్నీ ఇక్కడి మీడియా పాయింట్ లోనివే. కరోనా వైరస్ నేపథ్యంలో ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. అయితే, అసెంబ్లీలో మీడియా గ్యాలరీకి మాత్రం జర్నలిస్టులను అనుమతించనున్నారు. అసెంబ్లీ సమావేశాలను పూర్తిగా కుదించి 2రోజులకు తగ్గించినట్టు ఏపి ప్రభుత్వం తెలుస్తోంది.
మీడియాకు అనుమతి లేదు..
అలాగే ఇంతకుముందులా ఎవరిని పడితే వారిని సిఫారసులపై అనుమతించే ప్రసక్తేలేదని అసెంబ్లీ కార్యదర్శి చెప్పుకొస్తున్నారు. చివరకు శాసన సభ్యుల వ్యక్తిగత సిబ్బందితో పాటు సహాయకులు, రక్షణ అధికారులు కూడా లోనికి అనుమతి లేదని ప్రకటించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద అన్ని కార్యకలాపాలను నిషేధించారు. ఇది జనం ఎక్కువగా గుమిగూడే అవకాశం ఉన్న ప్రాంతం కావడంతో రద్దు చేశారు. శాసన మండలి, శాసన సభ రెండూ కొనసాగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
లాబీల్లో జరిగే రసవత్తర సన్నివేశాలు ఇక బయటకు తెలియవు..
ఇదిలా ఉండగా చాలా మంది శాసన మండలి రద్దయ్యింది అనుకున్నారు. కానీ మండలిని కొనసాగిస్తున్నట్లు తాజా ఆదేశాల ద్వారా స్పష్టమైంది. అంతే కాకుండా లాబీల్లోకి మీడియాను కాకుండా మీడియా ప్రతినిధులను గతంలో అనుమతించే వారు. ఇప్పుడు ఆ సంప్రదాయానికి తెరదించింది ఏపీ ప్రభుత్వం. సరిగ్గే ఇక్కడే అధికార, ప్రతిపక్ష నేతల మద్య జరిగే రసవత్తర సన్నివేశాలు ప్రపంచానికి తెలుస్తాయి. ప్రజాప్రతినిధులు పరస్పరం వేసుకునే జోకులు, పలకరింపులు, చమత్కారాలు, రహస్యాలు బయట ప్రపంచానికి తెలిసేది ఇక్కడనుండే. మీడియా ప్రతినిధులను లాబీలనుండి నిషేధించడంతో ఇప్పుడు అలాంటి ఆసక్తి కలిగించే అంశాలు ప్రపంచానికి తెలియకపోవచ్చు.