ఏపీ అసెంబ్లీలో ఇవాళ కూడా సస్పెన్షన్ల పర్వం- టీడీపీ ఎమ్మెల్యే నిమ్మలకు ఝలక్
ఏపీ అసెంబ్లీలో ఇవాళ కూడా నిరసనల పర్వం కొనసాగుతోంది. రైతుల పంట బీమా ప్రీమియం ప్రభుత్వం కట్టకపోవడాన్ని నిరసిస్తూ టీడీపీ సభ్యులు ఇవాళ కూడా నిరసనలు కొనసాగించారు. దీంతో పాటు పేదల ఇళ్లపై కూడా చర్చించాలని పట్టుబట్టారు. స్పీకర్ తమ్మినేని ఎంత వారించినా టీడీపీ సభ్యులు శాంతించలేదు.
Recommended Video
ఏపీ అసెంబ్లీ ఉదయం ప్రారంభం కాగానే నిన్న చర్చించిన రైతుల పంట బీమా ప్రీమియం అంశాన్ని టీడీపీ మరోసారి లేవనెత్తింది. రైతులకు పంట బీమా ప్రీమియం ప్రభుత్వం కట్టకపోవడాన్ని టీడీపీ తీవ్రంగా తప్పుబట్టింది. ఈ అంశంపై చర్చకు అవకాశం ఇవ్వాలని కోరుతూ టీడీపీ సభ్యులు పోడియాన్ని చుట్టుముట్టారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. కీలకమైన బిల్లులు పెండింగ్లో ఉన్నందున వాటిపై చర్చిద్దామని స్పీకర్ సూచించినా టీడీపీ ఎమ్మెల్యేలు వినలేదు. దీంతో ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును ఒక రోజు పాటు సస్పెండ్ చేస్తూ సభ తీర్మానం ఆమోదించింది.
నిన్న కూడా నివర్ తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం కోసం టీడీపీ తీవ్రంగా పట్టుబట్టింది. డిసెంబర్ చివరి లోగా పరిహారం చెల్లించి తీరుతామని ప్రభుత్వం హామీ ఇచ్చినా టీడీపీ నేతలు పట్టు వీడలేదు. దీంతో ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబు సహా 13 మంది టీడీపీ ఎమ్మెల్యేలను ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు. ఇవాళ కూడా టీడీపీ ఇదే అంశంపై పట్టుబట్టడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు. ఇప్పుడు సభ తిరిగి ప్రారంభమైంది.