చదువుకొని రండి, చర్చిద్దాం: రోజా ఇష్యూపై కోడెల, బాబు మెట్టు దిగారా?
హైదరాబాద్: వైసిపి ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై అసెంబ్లీలో శుక్రవారం నాడు చర్చకు వచ్చింది. సభ దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటుందని స్పీకర్ కోడెల శివప్రసాద రావు చెప్పారు. కోర్టు తీర్పు చదువుకొని వస్తే రోజా విషయమై చర్చిద్దామన్నారు. రోజా సస్పెన్షన్ సభ నిర్ణయమని చెప్పారు.
అనంతరం తీర్పు కాపీలను అందరికీ పంపిణీ చేశారు. శాసన సభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ... తమకు ఎవరినీ ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశ్యం లేదని చెప్పారు. సభా నిర్ణయం కాబట్టి చర్చించాలని నిర్ణయించామని చెప్పారు. అనంతరం యనమల బడ్జెట్ పైన చర్చిస్తున్నారు.
అసెంబ్లీ వేదికగా తీసుకున్న నిర్ణయాలను కోర్టులు ప్రశ్నించలేవని యనమల స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ఎవరిపైనా కోపం లేదన్నారు. హైకోర్టు ఆర్డన్ను కించపరచాలని కూడా భావించడం లేదని స్పష్టం చేశారు.
రోజా పైన మెట్టు దిగారా?
రోజా వివాదంలో ప్రభుతవం ఓ మెట్టు దిగిందా అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. రోజాను తిరిగి అసెంబ్లీలోకి అనుమతించాలా? వద్దా? అన్న విషయమై సోమవారం నాడు అసెంబ్లీలో చర్చ చేపడతామని స్పీకర్ ప్రకటించడం గమనార్హం.
ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ చెప్పారు. సభ తీసుకున్న సస్పెన్షన్ నిర్ణయంపై సభ మరో నిర్ణయం తీసుకుంటుందని కూడా ఆయన చెప్పారు. ఈలోగా హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీలను అందరూ చదువుకుని రావాలని సలహా ఇచ్చారు.