ఆనం..వంశీ వైపే అందరి చూపు: సీఎం జగన్ వర్సెస్ చంద్రబాబు: సభలో సవాల్..!
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. కొద్ది రోజులుగా హాట్ హట్ గా మారిన ఏపీ రాజకీయాలు ఈ సమావేశాల ద్వారా సభా వేదికగా మరింత వేడి పుట్టించనున్నాయి. అనేక అంశాల మీద ప్రభుత్వాన్ని నిలదీయటానికి సిద్దమని టీడీపీ చెబుతుంటే..ఇప్పటి వరకు చేస్తన్న అన్ని విమర్శలకు అసెంబ్లీ నుండే సమాధానం ఇవ్వటానికి సీఎం సిద్దం అవుతున్నారు. సమావేశాల్లో ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు అధికార పక్షం సమాయత్తమైంది.
ప్రతిపక్ష టీడీపీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడంపై దృష్టి సారించింది. బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్షం నుంచి దీటైన ప్రతిఘటన ఎదురైంది. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దాని పైన బీఏసీలో నిర్ణయించనున్నారు. తొలి రోజున సభలో దిశ హత్యోదంతంపైన చర్చ జరగనుంది. ఇక...ఈ సమావేశాల్లో టీడీపీ నుండి సస్పెండ్ అయిన ఎమ్మెల్యేల వల్లభనేని వంశీ ..వైసీపీ నుండి అసమ్మతి వినిపిస్తున్న సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి తీరు ఎలా ఉండబోతుందనేదే ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది.
నేటి నుండి అసెంబ్లీ సమావేశాలు
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈ సారి రాజకీయంగా వేడి పుట్టించటం ఖాయంగా కనిపిస్తోంది. తమ ఆరు నెలల పాలనలో అమలు చేసిన నిర్ణయాలు..సంక్షేమం పైన చర్చించి..సభ నుండి ప్రజలకు వివరించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఇదే సమయంలో తొలి రోజు ఉల్లి ధరలు..నిత్యావసరాల ధరల పైన ఆందోళన వ్యక్తం చేయాలని టీడీపీ నిర్ణయించింది. రాజధాని..పోలవరం.. ప్రతిపక్ష కార్యకర్తల పైన దాడులు..చంద్రబాబు కాన్వాయ్ పైన రాజధానిలో దాడికి యత్నం..వంటి అంశాల పైన ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని టీడీపీ భావిస్తోంది. తొలి రోజు ప్రశ్నోత్తరాలు ముగిసిన తరువాత బీఏసీ సమావేశంలో సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దాని పైన నిర్ణయం తీసుకోనున్నారు. దాదాపు పది పని దినాలు సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నారు. అదే సమయంలో 20 ప్రధాన అంశాల పైన సభలో చర్చకు అటు అధికార..ఇటు ప్రతిపక్ష పార్టీలు సిద్దంగా ఉన్నాయి.
తొలి రోజు దిశ హత్యోదంతం పైన చర్చ..
మొదటి రోజు దిశ హత్యాచారం పై చర్చ జరిగే అవకాశం ఉంది...ఏపీ ప్రభుత్వం కూడా మహిళలపై అత్యాచారాలు దాడులకు సంబంధించి కీలక చట్టం చేసే ఆలోచనలో ఉంది. ఇప్పటికే దీనిపై సీఎం జగన్ కొన్ని సూచనలు ఇచ్చారు..రాష్ట్రంలో ఎట్టి పరిస్థితి ల్లో శాంతి భద్రతల విషయం లో రాజీ పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో మహిళలు కు సంబంధించిన కీలక చట్టం చేసే ఆలోచన లో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మహిళల పైన జరిగిన దాడుల అంశాన్ని ప్రస్తావించేందుకు టీడీపీ.. చంద్రబాబు హాయంలో జరిగిన అంశాలను లేవనెత్తేందుకు వైసీపి సిద్దం అవుతున్నాయి. ఇక, ప్రభుత్వం నుండి ఈ సమావేశాల్లో 5 బిల్లులు ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. తొలి రోజు నుండే ప్రభుత్వం మీద రాజకీయంగా దాడి చేయాలని టీడీపీ శాసనసభా పక్షం నిర్ణయించింది. ఇక, అంశాల వారీగా వైసీపీ నుండి 20 అంశాల పైన 14 టీంలు సిద్దం అయ్యాయి.
ఆనం..వంశీ వైపే అందరి చూపు..
ఈ సమావేశాల్లో టీడీపీ నుండి సస్పెండ్ అయి..వైసీపీకి దగ్గరైన వల్లభనేని వంశీ సీటు వ్యవహారం నుండి ఆయన వైఖరి ఎలా ఉంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది. టీడీపీ వంశీని పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు స్పీకర్ కు సమాచారం ఇస్తే ఆయనను స్వతంత్ర అభ్యర్ధిగా సీటు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ఇంగ్లీషు మీడియం స్కూళ్లు..ప్రభుత్వ విధానాల పైన ఆయన ప్రభుత్వానికి మద్దతుగా వాయిస్ వినిపించే ఛాన్స్ కనిపిస్తోంది. అదే విధంగా..వైసీపీ నుండి నెల్లూరు జిల్లా సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు కలకలానికి కారణమయ్యాయి. ఆయన మీద ముఖ్యమంత్రి సైతం సీరియస్ అయ్యారు. దీంతో..ఆయన సభలో ఏ రకంగా వ్యవహరిస్తారనేది ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది. టీడీపీ నుండి పలువురు ఎమ్మెల్యేలు పార్టీ మారుతారనే ప్రచారం నడుమ ఇప్పుడు సభకు ఎంతమంది హాజరవుతారు..ఏ రకంగా వ్యవహరిస్తారనే దాని పైనే రాజకీయంగా ఫోకస్ కనిపిస్తోంది.