డిసెంబర్ 2 నుండి ఏపీ అసెంబ్లీ: 15 రోజుల సమావేశాలు: వంశీ వ్యవహారంపై స్పీకర్ కీలక వ్యాఖ్యలు..!
ఏపీలో అధికార..ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయాలు హీట్ ఎక్కిన సమయంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు రంగం సిద్దమైంది. అసెంబ్లీ శీతాకాల సమావేశాలను డిసెంబర్ 2వ తేదీ నుండి నిర్వహించటాని కి ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ లో సమావేశాలు నిర్వహించిన ప్రభుత్వం..తిరిగి ఆరు నెలల్లోగా సభను ఏర్పాటు చేయాల్సి ఉంది. అందులో భాగంగా..శీతాకాల సమావేశాలను నిర్వహించాలని నిర్ణయం తీసు కుంది. ఈ సారి సమావేశాల్లో ప్రస్తుతం రాజకీయంగా వివాదాలకు కారణమైన తాజా అంశాలు సభలో వేడి పుట్టించే అవకాశం ఉంది. మొత్తంగా 15 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. ఇక, ఇదే సమయం లో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన వంశీ వ్యవహారంలో స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేసారు.
డిసెంబర్2 నుండి అసెంబ్లీ సమావేశాలు
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 2 నుండి ప్రారంభం కానున్నాయి. దాదాపు 15 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమావేశాల్లో ప్రధానంగా ప్రభుత్వం అమలు చేస్తున్న నిర్ణయాలు..వివాదాస్పదం అయిన అంశాలు..ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద చేస్తున్న రాజకీయ విమర్శలకు కారణమైన వ్యవహారాల మీద చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా ప్రభుత్వం ఇసుక పాలసీ..భవన నిర్మాణ కార్మికులు..ఇంగ్లీషు మీడియం అమలు.. సింగపూర్ తో స్టార్టప్ ఏరియా డెవలప్ మెంట్ ఒప్పందం రద్దు.. ఎక్సైజ్ విధానం.. తెలంగాణలో సంబంధాలు..రివర్స్ టెండరింగ్.. మతరపమైన వివాదాలు..అవినీతి వంటి అంశాల మీద చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక..ఇంగ్లీషు మీడియం అమలు మీద కేటినెబ్ లో నిర్ణయం తీసుకున్నా..అసెంబ్లీలో చర్చ తరువాత బిల్లు ఆమోదించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో పాటుగా ఇతర కీలక అంశాలు చర్చకు రానున్నాయి.
వంశీ వ్యవహారం పైన స్పీకర్ ..
టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేసారు. ఏ సభుడైనా పార్టీ మారాలనికుంటే తప్పనిసరిగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిందేనని స్పష్టం చేసారు. సభా నాయకుడిగా ముఖ్యమంత్రి సైతం ఇదే విషయాన్ని చెప్పారని..దీనికి తాను కట్టుబడి ఉన్నానని వివరించారు. సభాపతిగా తన వైఖరి సైతం అదేనని తేల్చి చెప్పారు. సభా వ్యవస్థలను డిజిటలైజ్ చేస్తున్నామన్నారు. ఇప్పటికే పేపర్ లెస్ డిజిటలైజ్ దిశగా చర్చలు చేపట్టామని వివరించారు. స్పీకర్ వైఖరి ఇలా ఉండగా..వైసీపీ నేతలు మాత్రం వల్లభనేని వంశీ తమ పార్టీలో చేరలేదని చెబుతున్నారు. వంశీ అవసరమైన సమయంలో రాజీనామా చేస్తానని ఇప్పటికే స్పష్టం చేసారు.
స్పీకర్ పైన విమర్శలు..ప్రివిలేజ్ నోటీసులు
ఇదే సమావేశాల సమయంలో టీడీపీ నేతల మీద సభా హక్కుల ఉల్లంఘన అంశం తెర మీదకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికే వైసీపీ నేతలు టీడీపీకి చెందిన ముగ్గురు నేతల మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ నోటీసులు ఇచ్చారు. స్పీకర్ తమ్మినేని సీతారాం మీద మాజీ మంత్రులు లోకేశ్..అచ్చెన్నాయుడు..మాజీ విప్ కూన రవికుమార్ అనుచిత వ్యాఖ్యలు చేసారని..స్పీకర్ వ్యవస్థను కించపరిచేలా ప్రవర్తించిన ఆ ముగ్గురు మీద చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశాల సమయంలోనే దీని మీద స్పీకర్ నిర్ణయం తీసుకొనే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రివిలేజ్ కమిటీ సైతం ఇప్పటికే ఏర్పాటు చేసి ఉండటంతో ఆ కమిటీకి ఈ వ్యవహారాన్ని రిఫర్ చేసే పరిస్థితి కనిపిస్తోంది.
టీడీపీ నుండి హాజరయ్యే వారెంత మంది..
ఇక, టీడీపీలో ఇప్పటికే వల్లభనేని వంశీ పార్టీ వీడారు. మాజీ మంత్రి గంటా పార్టీకి పూర్తిగా దూరంగా ఉంటున్నారు. చంద్రబాబు నిర్వహించిన ఇసుక దీక్ష..పార్టీ సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. పలువురు ఎమ్మెల్యేల పార్టీ మారుతున్నారనే ప్రచారం సాగుతోంది. ఇక, టీడీపీ ఎమ్మెల్యేలంతా సభకు వస్తారా..వచ్చినా టీడీపీ కి మద్దతుగా నిలుస్తారా అనే ఆసక్తి నెలకొని ఉంది. దీంతో..ఇప్పుడు వంశీ వ్యవహారంతో టీడీపీ వర్సెస్ వైసీపీగా మారిన రాజకీయం..ఇప్పుడు ఈ సమావేశాల్లో మరింత వేడి పుట్టించే పరిస్థితులు కనిపిస్తున్నాయి.