1240 కోట్లను ఆకర్షించిన ఏపీ! ఇలా చేయండి.. అమరావతి పత్రికలో ఏముంది?
విజయవాడ: ఏపీలో పర్యాటక రంగ అభివృద్ధికి మరో అడుగు పడింది. విజయవాడలో శనివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు సమక్షంలో రూ.1240 కోట్ల విలువైన ఎనిమిది పర్యాటక ప్రాజెక్టులపై ఒప్పందం కుదిరింది.
ఇందులో భాగంగా విజయవాడ, తిరుపతి, విశాఖల్లో ఎమ్యూజెమెంట్, వాటర్ వరల్డ్ పార్కులు నిర్మించనున్నారు.
డెస్టినేషన్ అండ్ ప్యాకేజ్ టూర్లు, హోటల్స్, రిసార్టులు, బీచ్ రిసార్టులు, ఫైవ్ స్టార్, తీస్టార్ హోటళ్లు, కడపలో వే సైడ్ అమెనిటీస్ ఏర్పాటు తదితర ఒప్పందాలు ఖరారయ్యాయి. తిరుచానూరులో గేట్ వే హోటల్ నిర్మాణానికి ఒప్పందం జరిగింది. రెండకెరాల విస్తీర్ణంతో రూ.85 కోట్ల పెట్టుబడితో గేట్వే హోటల్ను నిర్మించనున్నారు.
అమరావతి ఆహ్వాన పత్రిక
ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన వేడుకను అందరూ ముక్కన వేలేసుకునేలా నిర్వహించేందుకు అడుగులు పడుతున్నాయి. నూతన నగర నిర్మాణానికి పునాది రాయి వేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అంగీకరించారు. ఈ నేపథ్యంలో అమరావతి ఆహ్వాన పత్రికను ముఖ్యమంత్రి చంద్రబాబు ఫైనలైజ్ చేశారు.
అక్టోబర్ 22, 2015న మధ్యాహ్నం గం.12.45 నిమిషాలకు శంకస్థాపన జరుగుతుందని తెలియజేస్తూ... పత్రికను ముద్రించారు. ఒక వైపు ముహూర్తాలు, మరోవైపు అమరావతి స్థూపం ఉంటుంది. నాలుగు పేజీలు ఉన్నాయి. తారప పుష్ప ముద్ర, మరోవైపు నగర ప్రణాళికలు ఉన్నాయి.
ఆహ్వానితులంతా ఉదయం పదిన్నర గంటలకల్లా సభా ప్రాంగణానికి చేరుకోవాలని, భద్రతా కారణాల రీత్యా ఆహ్వాన పత్రికను తమతో ఉంచుకోవాలని, కేవలం ఆహ్వానితులు మాత్రమే రావాలని అందులో స్పష్టం చేశారు. హ్యాండ్ బ్యాగ్స్, బ్రీఫ్ కేసులు, కెమెరాలు మొబైల్ ఫోన్లు, సిగరేట్లు, అగ్గిపెట్టెలు, లైటర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, మంచినీటి సీసాలు, కార్ సెంట్రల్ లాకింగ్ వస్తువులు వంటి వాటిని వేదిక వద్దకు తీసుకు రావద్దని కోరారు.