సోము వీర్రాజు టీమ్ ఇదే: బీజేపీ పదాధికారుల లిస్ట్: టీడీపీ మాజీమంత్రులకు కీలక పోస్టులు
అమరావతి: భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ పదాధికారుల జాబితా విడుదలైంది. పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు కొద్దిసేపటి కిందటే ఈ జాబితాను ప్రకటించారు. పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, వివిధ మోర్చాల అధ్యక్షులు, అధికార ప్రతినిధుల పేర్లను వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో తీర్థాన్ని పుచ్చుకున్న నేతలకు పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్నారని భావిస్తోన్న ఇద్దరు టీడీపీ మాజీమంత్రులకు మాత్రం కీలక పదవులు దక్కాయి. వారికి ఉపాధ్యక్ష పదవిని అప్పగించారు.
10 మందితో ఉపాధ్యక్షులు..
బీజేపీ రాష్ట్రశాఖకు మొత్తం 10 మందిని కొత్తగా ఉపాధ్యక్షులుగా నియమించారు. టీడీపీ మాజీమంత్రులు ఆదినారాయణ రెడ్డి, రావెల కిశోర్బాబులను ఉపాధ్యక్షులుగా నియమించారు. విశాఖపట్నానికి చెందిన మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకూ ఈ జాబితాలో చోటు కల్పించారు. రేలంగి శ్రీదేవి (రాజమహేంద్రవరం), కాకు విజయలక్ష్మి (నెల్లూరు), మాలతీ రాణి (ఏలూరు), నిమ్మక జయరాజు (పార్వతీపురం), పైడి వేణుగోపాల్ (శ్రీకాకుళం), పీ సురేందర్ రెడ్డి (నెల్లూరు), చంద్రమౌలి (కర్నూలు)లను ఉపాధ్యక్ష పదవులను అప్పగించారు.
ప్రధాన కార్యదర్శులుగా మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డి
అయిదుమందిని పార్టీ ప్రధాన కార్యదర్శులుగా నియమించారు. ఉత్తరాంధ్రకు చెందిన ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ (విశాఖపట్నం), రాయలసీమకు చెందిన సోమగుంట విష్ణువర్ధన్ రెడ్డి (హిందూపురం) పేర్లను ఈ జాబితాలో చేర్చారు. వారితో పాటు లోకుల గాంధీ (అరకు), సూర్యనారాయణ రాజు (కాకినాడ), ఎన్ మధుకర్ (విజయవాడ)లను ఈ పదవుల్లోకి తీసుకున్నారు. మధుకర్.. కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తారు. విజయవాడకే చెందిన సత్యమూర్తిని కోశాధికారిగా నియమించారు. రాష్ట్ర పార్టీ కార్యాలయ కార్యదర్శిగా పీ శ్రీనివాస్ నియమితులు అయ్యారు.
కార్యదర్శులుగా పది మంది
రాష్ట్ర కార్యదర్శులుగా మొత్తం 10 మందిని నియమించారు. ఉమామహేశ్వరి (శ్రీకాకుళం), కండ్రిక ఉమ (తిరుపతి), మట్టం శాంతికుమారి (అరకు), ఏ కమల (నెల్లూరు), కే చిరంజీవి రెడ్డి (అనంతపురం), పాతూరి నాగభూషణం (విజయవాడ), కే నీలకంఠ (కర్నూలు), బీ శ్రీనివాస్ వర్మ (నరసాపురం), ఎన్ రమేష్ నాయకుడు (రాజంపేట), ఎం సుధాకర్ రెడ్డి (గుంటూరు)లను కార్యదర్శులుగా చోటు కల్పించారు.
మోర్చాల అధ్యక్షులు వీరే..
బీజేపీ రాష్ట్రశాఖ అనుబంధంగా పనిచేసే ఏడు మోర్చాలకు అధ్యక్షులను నియమించారు. సురేంద్ర మోహన్-యువ మోర్చా (విశాఖపట్నం), నిర్మలా కిశోర్-మహిళా మోర్చా (ఏలూరు), శశిభూషణ్ రెడ్డి-కిసాన్ మోర్చా (కడప), జీ దేవానంద్-ఎస్సీ మోర్చా (హిందూపురం), బిట్ర శివనారాయణ-ఓబీసీ మోర్చా (నరసరావుపేట), కే ఉమామహేశ్వర రావు-ఎస్టీ మోర్చా (అరకు), ఎస్కే బాజీ-మైనారిటీ మోర్చా (విజయవాడ) నియమితులు అయ్యారు.
Recommended Video
అధికార ప్రతినిధులుగా..
పార్టీ అధికార ప్రతినిధులుగా ఆరుమందిని నియమించారు. పూడి తాతారావు (శ్రీకాకుళం), సుహాసిని ఆనంద్ (విశాఖపట్నం), చందు సాంబశివరావు (గుంటూరు), కే ఆంజనేయ రెడ్డి (నెల్లూరు), సామంచి శ్రీనివాస్ (తిరుపతి), భాను ప్రకాశ్ రెడ్డి (తిరుపతి)లకు ఈ జాబితాలో చోటు దక్కింది.