రామమందిరం కల సాకారం వేళ ఏపీలో బీజేపీ సంబరాలు- టపాసులు, స్వీట్లతో హంగామా...
విజయవాడ : అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఇవాళ తొలి అడుగు పడుతున్న వేళ ఏపీలో బీజేపీ నేతలు ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు. దశాబ్దాలుగా పార్టీ అజెండాలో ఉన్న రామమందిర నిర్మాణం సాకారం అవుతుండటంతో ఆ పార్టీ నేతల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంతో పాటు పలుచోట్ల కాషాయ నేతలు టపాసులు పేల్చి, స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు.
అయోధ్యలో రామమందిరానికి ప్రధాని భూమిపూజ నిర్వహిస్తున్న సందర్భంగా ఏపీలోనూ ప్రభుత్వం రామాలయాల్లో అధికారికంగా ఉత్సవాలు నిర్వహిస్తే భక్తులు సంతోషిస్తారని బీజేపీ యువమోర్చా నేత రమేష్ నాయుడు ప్రభుత్వాన్ని కోరారు. ఏపీ ప్రభుత్వం ఈ సందర్భంగా నదుల వద్ద శ్రీరామ హారతులు ఇవ్వాలని కూడా కోరారు. ఆగస్టు 5వ తేదీ చరిత్రలో లిఖించదగిన రోజుగా మిగిలిపోతుందని రమేష్ నాయుడు తెలిపారు. తెలంగాణలోని భద్రాద్రి కోదండ రామాలయంలో నిర్వహిస్తున్నట్లే కడప జిల్లా ఒంటిమిట్ట ఆలయంలో అధికారికంగా శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించాలని ఆయన కోరారు.