ఇసుక దోపిడీలో వైసీపీ నేతలు..? కార్మికులకు ఉపాధి ఏదీ.. జగన్కు కన్నా ప్రశ్న
ఏపీ సీఎం జగన్పై బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ఓ రేంజ్లో ఫైరయ్యారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని విమర్శించారు. కార్మికులను, కర్షకులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఇతర పార్టీ నేతలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కడపలో పలువురు నేతలు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో బీజేపీలో చేరారు.
అక్రమ కేసులతో ఇతర పార్టీ నేతలను వేధిస్తున్నారని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. ఇతర పార్టీ నేతలను వేధిస్తున్నారని.. ఇది సరికాదన్నారు. వారిని పోలీసుల చేత బెదిరిస్తున్నారని గుర్తుచేశారు. లేదంటే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి ఇబ్బందులు పాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇతర పార్టీ నేతలను వేధించడం ఏంటి అని ప్రశ్నించారు. జగన్ వైఖరి సరికాదని.. తీరు మార్చుకోవాలని ఆయన హితవు పలికారు.
ఏపీలో కృత్రిమంగా ఇసుక కొరతను సృష్టించారని కన్నా ఆరోపించారు. ఇసుక కొరత వేలాది మంది జీనవంపై ప్రభావం చూపిందన్నారు. ఇసుక లేక భవన నిర్మాణాలు నిలిచిపోయాయని చెప్పారు. దీంతో భవన నిర్మాణాలపై ఆధారపడ్డ కార్మికులు రోడ్డునపడ్డారని చెప్పారు. వారి ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోదా ? ఇసుక కొరత సమస్యను తీర్చారా అని ప్రశ్నించారు.
వైసీపీ నేతలే ఇసుక దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. వారిని సీఎం జగన్ ప్రోత్సహిస్తున్నారని, అందుకే వారు రెచ్చిపోతున్నారని చెప్పారు. సొంత పార్టీ నేతల ప్రయోజనాల కోసం చూసుకుంటే.. ఇటు కార్మికుల ఉపాధిపై ప్రభావం చూపుతుందన్నారు.