వాళ్లకి మీరు చేసినంత అన్యాయం మరెవరైనా చేశారా?:సిఎం చంద్రబాబుకు కన్నా 17 వ లేఖ
గుంటూరు:భారతదేశ చరిత్రలో ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నిక కాబడిన గ్రామ సర్పంచ్ లకు మీరు చేసినంత అన్యాయం మరెవరైనా చేశారా?...అని ముఖ్యమంత్రి చంద్రబాబు ను ఎపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుకి వారానికో లేఖ రాస్తున్న భాజపా రాష్ట్ర కన్నా లక్ష్మీనారాయణ బుధవారం తాజాగా 17వ లేఖను సంధించారు.ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సర్పంచులను కాదని జన్మభూమి కమిటీలకు పెత్తనం కట్టబెట్టి పంచాయతీరాజ్ చట్టాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అపహాస్యం చేశారని కన్నా దుయ్యబట్టారు.
ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బుధవారం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి 17 వ లేఖాస్త్రం సంధించారు. ఈ లేఖలో ఆయన మరో ఐదు ప్రశ్నలు వేశారు. దీంతో ఇప్పటి దాకా కన్నా సిఎం చంద్రబాబుకు పంపిన ప్రశ్నల సంఖ్యకు 85కి చేరింది. అయితే ఇప్పటి వరకు కన్నా లక్ష్మీనారాయణ పంపిన ప్రశ్నలకు సిఎం చంద్రబాబు నుంచి ఎటువంటి స్పందన లేదు. కన్నా సిఎం చంద్రబాబుకు సంధించిన తాజా 5 ప్రశ్నలు ఇవి....
ప్రశ్న నెంబర్ 81: మీరు, మీ కుమారుడు, మీ అనుచరులు, మీ చెంచా మీడియా అందరూ కలిసి కేంద్ర ప్రభుత్వం కక్ష పూరితంగా ఐటీ దాడులు చేయిస్తుందని గగ్గోలు పెట్టారు. మీ బినామీ సిఎం రమేష్ మీసాలు కూడా తిప్పుతున్నారు. ఈ ఆరు సంవత్సరాల్లో ఎడ్కో(ఇండియా) కంపెనీ సీఎం రమేష్ రిత్విక్ సంస్థ రూ.12 కోట్లు చెల్లిస్తే, అసలు ఆ అడ్రస్లో ఆ కంపెనీనే లేదు. ఆ సంస్థ ప్రతినిధి సాయిబాబా రిత్విక్ కంపెనీ అకౌంటెంట్ కాదని మీరు ప్రకటించగలరా?...సూట్ కేసు కంపెనీలకు చెల్లించిన డబ్బుపై విచారణ చేయించుకోగలరా?...ఈ డబ్బేగా ఎంఎల్ఏలను కొనటానికి ఉపయోగించింది...తెలంగాణాలో రేవంత్ రెడ్డి చేత పంపినవీ ఇవేకదా?...
ప్రశ్న నెంబర్ 82: నీరు-చెట్టు పథకంలో భాగంగా సెక్రటేరియట్ దగ్గర నాటిన మొక్కలకు సంబంధించి చేసిన కోట్ల రూపాయల అవినీతిని ఇంకా ప్రజల మరచిపోక ముందే కుప్పం నియోజకవర్గంలో పంచిపెట్టేందుకు ఒక్కో క్రికెట్ బ్యాట్ను రూ.6 వేలకు కొని, ప్రతీ డిపార్టుమెంటులో అవినీతిని నిరూపించారు. జీఓ ఆర్టీ నెంబర్.413, యూత్ అడ్వాన్స్మెంట్, టూరిజం, కల్చర్ శాఖ, 16-10-2018 తేదీన 250 క్రికెట్ బ్యాట్లను మెస్సర్ ఎక్సెల్ స్పోర్ట్స్ నుంచి రూ.15 లక్షలకు కొన్న మాట అబద్ధమా?... మీ నియోజకవర్గంలో పంచే క్రికెట్ బ్యాట్లలో కూడా అవినీతికి పాల్పడింది వాస్తవం కాదా?
ప్రశ్న నెంబర్ 83: అస్తమానం మీరు, మీ అనుచరులు కేంద్రం నుంచి ఎలాంటి సాయం సహకారం లేదని గగ్గోలు పెడుతూ ఉంటారు. సాక్షాత్తూ ఏపీ చీఫ్ సెక్రటరీ దినేష్ కుమారే దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నాఏపీకి ఉపాధి పథకం కింద అత్యధికంగా నిధులు వచ్చాయని చెబుతున్నారు కదా? అందువల్ల 1776 గ్రామపంచాయతీ భవనాలను, 4843 అంగన్వాడీ భవనాలకు, 15వేల కి.మీల సీసీ రోడ్లను, 2.46 లక్షల పంట కుంటలను నిర్మించుకున్నామని చీఫ్ సెక్రటరీ చెప్పలేదా?...మరి ఇలా ముఖ్యమంత్రిగా ప్రజలను మోసం చేయడం అన్యాయం కాదా?
ప్రశ్న నెంబర్ 84: రాష్ట్రంలో ప్రతిప్రాజెక్టు మీకూ, మీ కుమారునికీ, మీ మంత్రులకూ అనుచరులకూ, కలెక్షన్లకూ కేంద్రమైంది. ప్రాజెక్టులన్నీ మీ బినామీలకు అప్పగించడం, అంచనాలు పెంచడం, నిధులన్నీ దోచిపెట్టడం, ఆ నిధులన్నీ మరలా మీ దగ్గరకు రావడం. కృష్ణా నదిపై వైకుంఠాపురం బ్యారేజ్ నిర్మాణం అంచనాలను రెండుసార్లు ఎందుకు పెంచాల్సి వచ్చింది. రెండుసార్లు టెండర్లను ఎందుకు రద్దు చేయవలసి వచ్చిందో ప్రజలకు వివరిస్తారా?...ఇదంతా మీకు అవగాహన ఉన్న కాంట్రాక్టరుకు లబ్ది చేకూర్చేందుకు కాదా?...
ప్రశ్న నెంబర్ 85: భారత దేశ చరిత్రలో ప్రజస్వామ్యబద్దంగా ఎన్నిక కాబడిన గ్రామసర్పంచులకు మీరు చేసినంత అన్యాయం మరెవరైనా చేశారా?...వాళ్లను పక్కన పెట్టి, జన్మభూమి కమిటీల పేరుతో సర్పంచుల హక్కులను హరించారు. పంచాయతీరాజ్ చట్టాన్ని నిర్వీర్యం చేశారు. ఇప్పుడు 20, 30 నెలల నుంచి వాళ్లకు జీతాలు లేవు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ప్రజల సంతృప్తి స్థాయి బ్రహ్మాండంగా ఉందని గొప్పలు చెప్పుకుంటున్నారు కదా? మరి గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎందుకు నిర్వహించలేకపోతున్నారో ప్రజలకు వివరించగలరా? ఎలక్షన్లు నిర్వహించకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రావలసిన నిధులు రాకపోతే దాని బాధ్యత మీరు వహించేందుకు సిద్ధంగా ఉన్నారా?...అని కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు.