ఇన్ని రహస్య జీవోల వెనుక ఏముంది?: చంద్రబాబుకు కన్నా 5 ప్రశ్నలు
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ బుధవారం మరో ఐదు ప్రశ్నలు సంధించారు. ఆయన ఇదివరకు రెండు వారాల పాటు పది ప్రశ్నలు సంధించారు. ఇప్పుడు మరో ఐదు ప్రశ్నలు విడుదల చేశారు. వీటిపై చంద్రబాబు స్పందించాలని డిమాండ్ చేశారు.
సంవత్సరానికి మూడు పంటలు పండే సారవంతమైన భూములను తీసుకొని, వారికి కనీస సౌకర్యాలు కల్పించకుండా వంచించారని, స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో సింగపూర్ సంస్థలకు దోచిపెట్టలేదా అని ప్రశ్నించారు. దీనిపై సీబీఐ విచారణకు సిద్ధమా అన్నారు.
2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చే సమయానికి లక్ష కోట్ల రుణభారం ఉండగా, ఇప్పుడు రూ.2.35 లక్షలకు పెరిగిందని, దీనికి సమాధానం ఏమిటన్నారు. రాష్ట్రాన్ని అప్పులలో కూరుకుపోయేలా చేశారని, మీకు సీఎంగా ఉండే నైతిక హక్కు ఉందా అని ప్రశ్నించారు.
గోదావరి పుష్కరాల సమయంలో 29మంది మృతి చెందడానికి మీ ప్రచార పిచ్చి కారణం కాదా అని, అలాగే వనం - మనం కార్యక్రమానికి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే అమాయక విద్యార్థులు చనిపోయారని.. దీనికి ఏం సమాధానం చెబుతారన్నారు.
ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించి, అసెంబ్లీలో తీర్మానం చేశారని, ప్యాకేజీలో భాగంగా నిధులు తీసుకుంటూ ప్రత్యేక హోదా అంటూ నినాదం ఎత్తుకోవడం రాష్ట్రంలో ప్రజలను మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు. పారదర్శక పాలన అని చెబుతున్నారని, కానీ అత్యధిక సంఖ్యలో రహస్య జీవోలు జారీ చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. అలా రహస్య జీవోలు ఎందుకు విడుదల చేశారని, అవి అవినీతి కోసం కాదా అన్నారు.