ఆ రేసులతో పాటు పేకాట పోటీలు కూడా పెట్టాల్సింది...చంద్రబాబుకు మానసిక వ్యాధి:కన్నా లక్ష్మీనారాయణ
Recommended Video
గుంటూరు:బిజెపి ఎపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఎపి ప్రభుత్వంపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. విజయవాడలో ఎఫ్ వన్ బోట్ రేసులు నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పేకాట పోటీలు కూడా నిర్వహించాల్సిందని కన్నా ఎద్దేవా చేశారు.
జగన్ కేసులో సిబిఐ విచారణ జరిగితే తన బండారం బైటపడుతుందనే చంద్రబాబు సిబిఐని రానివ్వమని చెబుతున్నారని కన్నా విమర్శించారు. అసలు ఓటుకు నోటు కేసు భయంతో హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు మానసిక వ్యాధితో బాధపడుతున్నారని కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. తనకు ఏదో జరగబోతోందనే భ్రాంతిలో చంద్రబాబు ఉన్నారన్నారు.
అగ్రిగోల్డ్ వ్యవహారంలో షాకింగ్ ట్విస్ట్:హాయ్ ల్యాండ్ తమది కాదని ప్లేటు ఫిరాయించిన సంస్థ యాజమాన్యం
బండారం...బైటపడుతుందనే
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ శుక్రవారం గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, టిడిపి ప్రభుత్వం, ఆ పార్టీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై హత్యాయత్నం కేసులో సీబీఐ విచారణ జరిగితే ఎక్కడ తన బండారం అంతా బయటపడిపోతుందోనని చంద్రబాబుకు భయం పట్టుకుందని...అందుకే సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వమని చెబుతున్నారన్నారు. రాష్ట్రంలో వ్యవస్థలు అన్నింటినీ చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారని కన్నా దుయ్యబట్టారు.
చక్రంలా తిరుగుతూ...చక్రం తిప్పుతున్నట్లు
ఎపి ప్రభుత్వం ఏఫ్1హెచ్2వో బోట్ రేసులతోపాటు పేకాట పోటీలకు కూడా అనుమతులు ఇస్తే బాగుండేదని కన్నా ఈ సందర్భంగా వ్యంగాస్త్రాలు సంధించారు. మరి రాష్ట్రానికి ఇప్పటి వరకు 565 కేంద్ర ప్రభుత్వ అవార్డులు వచ్చాయని విలేకరులు ప్రస్తావించగా...వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఇచ్చే అవార్డులను బట్టి వాటి సమర్థతను అంచనావేయలేమని,నిర్ధారించలేమని కన్నా వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వాలు పంపే కాకి లెక్కలు చూసి అక్కడి అధికారులు అవార్డులు ఇస్తుంటారని చెప్పారు. ఇక చంద్రబాబు దేశం మొత్తం చక్రంలాగా తిరిగి...ఇక్కడకు వచ్చి తానే చక్రం తిప్పుతున్నట్లు ఫీలవుతున్నారని లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు. ఈ తిరుగుడులో చంద్రబాబుకు శాలువాలు కప్పిన వారంతా ఎన్డీఏ వ్యతిరేకులేనని విశ్లేషించారు.
పోలవరంలో...ఒక బ్రోకర్ లాగా
పోలవరం ప్రాజెక్ట్ విషయంలో చంద్రబాబు అండ్ కో రాష్ట్రాన్ని అడ్డంగా దోచేశారని ఆరోపించారు. పోలవరం పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్ అని...ఇంకా పచ్చిగా మాట్లాడాలంటే ఒక బ్రోకర్ లా వ్యవహరిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కాంట్రాక్ట్ తీసుకొని సబ్ లీజులు ఇచ్చి కమీషన్లు దండుకుంటోందని కన్నా ఆరోపించారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో నాణ్యత లేదని మొదటి నుంచి తాము చెబుతూనే ఉన్నామని...ఇప్పుడు అదే రుజువవుతోందన్నారు. ఎపి ప్రభుత్వం తీరుతో ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
వాళ్లే...వ్యతిరేకించేది
అంతకుముందు కన్నా లక్ష్మీనారాయణ ఎపి ప్రభుత్వం సిబిఐకి నో చెబుతూ తీసుకున్న నిర్ణయంపై స్పందించిన కన్నా లక్ష్మీనారాయణ ట్విట్టర్ లో తన స్పందన పోస్ట్ చేశారు. చంద్రబాబు చేసిన అక్రమాలు వెలికితీస్తారనే భయంతోనే ఇలా బరితెగించి దేశ సార్వభౌమాధికారాన్ని, రాజ్యాంగ సంస్థలను ధిక్కరిస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబుకు...అర్బన్ నక్సలైట్లు, వేర్పాటువాదులకు ఏమాత్రం తేడా లేదన్నారు. సీబీఐ తన పని తాను చేస్తుంటే బాబు ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ప్రశ్నించారు. పోలీసుల తనిఖీని కేవలం దొంగలు, నేరస్తులు మాత్రమే వ్యతిరేకిస్తారని కన్నా తేల్చేశారు.