రామోజీరావుతో కన్నా లక్ష్మీనారాయణ భేటి:హై ఎలర్ట్
హైదరాబాద్:ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావును ఎపి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ మంగళవారం కలిశారు. హైదరాబాద్ లోని రామోజీ నివాసంకు వెళ్ళిన కన్నా ఆయనతో భేటి అయ్యారు.
ఈ సందర్భంగా రామోజీరావు, కన్నా మధ్య పలు రాజకీయ అంశాలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అయితే భేటీ అనంతరం కన్నా ఈ సమావేశం విషయమై మీడియాతో మాట్లాడుతూ రామోజీరావుతో తనకు ఉన్న పరిచయం కారణంగానే కలిశానే తప్ప తమ భేటీ వెనుక ఎలాంటి ప్రత్యేక కారణం, రాజకీయ కారణాలు లేవన్నారు.
అయితే మరోవైపు రామోజీతో ఎపి బిజెపి అధ్యక్షుడు కన్నా సమావేశం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించకుంది. ఎయిర్ ఏషియా ఉదంతంలో చంద్రబాబు పేరు బైటకు రావడం, బిజెపిపై టిడిపి నేతలు తారాస్థాయిలో విమర్శల నేపథ్యంలో ఏదో అతి ముఖ్యమైన విషయం చర్చించేందుకే ఈ ఇద్దరూ సమావేశం అయినట్లుగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
మరోవైపు కేంద్రంలో ప్రకంపనలు సృష్టించే కుంభకోణం ఒకటి త్వరలో వెలుగులోకి రాబోతోందంటూ ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు చేసిన ప్రకటన కూడా రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది. పైగా నెల రోజుల్లోనే ఆ కుంభకోణం అన్ని ఆధారాలతో దాన్ని బయటపెట్టనున్నట్లు వెల్లడించిన కుటుంబరావు ఆ స్కామ్ వెల్లడితో ఖచ్చితంగా దడపుట్టిస్తామని బిజెపి నేతలను హెచ్చరించారు.
తాజా పరిణామాలను బట్టి చూస్తే కేంద్రం-ఎపి ప్రభుత్వం మధ్య విభేదాలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో దేశాన్ని కుదిపేసే పలు వ్యవహారాలు వరుసగా వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు మాటల యుద్దానికే పరిమితమైన టిడిపి-బిజెపి ఇకపై చేతల్లో తమ సత్తా చాటడానికి ప్రయత్నించే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.