ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన చోటే, కన్నా లక్ష్మీనారాయణ మౌనదీక్ష, రాజధాని మార్పుపై నిరసన
ఏపీలో రాజధాని మార్పు రగడ నెలకొంది. మూడు రాజధానుల ప్రతిపాదనను టీడీపీ, బీజేపీ తప్పుపడుతున్నాయి. అమరావతి రాజధాని మార్చొచ్చని కోరుతున్నాయి. రాజధాని రైతుల ఆందోళన కొనసాగుతోంది. అమరావతి నుంచి క్యాపిటల్ సిటీ మార్చొద్దని రైతులు, టీడీపీ శ్రేణుల నిరసన కంటిన్యూ అవుతోంది. మరోవైపు శుక్రవారం మౌనదీక్షకు దిగుతానని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు.
మౌన దీక్ష
ఉద్దండరాయునిపాలెంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజధాని కోసం శంకుస్థాపన చేశారు. దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల నుంచి మట్టి, నీరు తీసుకొచ్చారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. రాజధాని ప్రాంతంపై జీఎన్ రావుతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. అమరావతితో సహా విశాఖపట్టణం, కర్నూలు రాజధానులుగా పరిగణించాలని కమిటీ సిఫారసు చేసింద. దీంతో అమరావతి రాజధాని మార్పు గురించి పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి.
ఉదయం 8.30 గంటలకు
ప్రధాని మోడీ రాజధాని శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెంలో శుక్రవారం ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ మౌన దీక్ష చేయబోతున్నారు. బీజేపీ శ్రేణులు కన్నా మౌన దీక్షలో పాల్గొననున్నారు. ఉదయం 8.30 గంటలకు కన్నా లక్ష్మీనారాయణ మౌన దీక్ష ప్రారంభమవుతుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అమరావతి రాజధాని మార్పును నిరసిస్తూ కన్నా లక్ష్మీనారాయణ దీక్ష చేయబోతున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదన మంచిది కాదని బీజేపీ నేతలు అంటున్నారు.
విశాఖకు నిధులు
జీఎన్ రావు కమిటీ ప్రతిపాదనపై ఏపీ భగ్గుమంటోన్న నేపథ్యంలో.. ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా మారబోతున్న విశాఖపట్టణానికి 394.50 కోట్లు విడుదల చేసింది. రహదారుల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన కోసం ఏడు జీవోలు విడుదల చేసింది. అమరావతి రాజధాని మార్చొద్దని రాజధాని రైతులు కోరుతుంటే, జగన్ ప్రభుత్వం మాత్రం కార్యనిర్వహక రాజధాని ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది.