సీఎం జగన్ది క్షమించరాని తప్పు.. కరోనా చర్యలపై కన్నా విమర్శలు... చిటికెలో పరిష్కరిస్తామన్న వైసీపీ
లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన పేద, బడుగువర్గాల కోసం మోదీ సర్కారు ప్రకటించిన రూ.1.70లక్షల కోట్ల ప్యాకేజీని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. ప్రస్తుత విపత్కాలంలో రాజకీయాలు పక్కనపెట్టి, దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ ఆయా పార్టీలు ప్రభుత్వాలకు సహకరిస్తున్నాయి. ఏపీలోనైతే చంద్రబాబు, పవన్ కల్యాణ్ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలిచ్చారు. బీజేపీ మాత్రం పాత పంథాలోనే సీఎం జగన్ పై విమర్శలు కురిపిస్తున్నది.
పొరుగురాష్ట్రం తెలంగాణతోపాటు దేశమంతటా ముందస్తుగానే జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ ఏపీలో మాత్రం వైరస్ నియంత్రణ చర్యలు ఆలస్యంగా మొదలయ్యాయని, కోరానా విషయంలో చాలా తేలికగా మాట్లాడి సీఎం జగన్ క్షమించరాని తప్పు చేశారని, దాన్ని కప్పిపుచ్చుకోడానికి ఇప్పుడు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. హైదరాబాద్ నుంచి వచ్చిన విద్యార్థులు, ఉద్యోగుల విషయంలోనూ వైసీపీ సర్కారు దారుణంగా వ్యవహరించిందని ఆరోపించారు. అలాగే, కాశీ యాత్రలో చిక్కుకుపోయిన తెలుగువారిని కాపాడాలంటూ లేఖరాసినా సీఎం పట్టించుకోలేదని మండిపడ్డారు.
అయితే, కన్నా కామెంట్లు చేసిన కొద్దిసేపటికే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్ లో కీలక విషయాలు రాసుకొచ్చారు. కరోనా నియంత్రణలో ఏపీ సర్కారు.. ప్రచార ఆర్భాటాలకు పోకుండా సైలెంట్ గా పనిచేసుకు పోతున్నదని, ఈ విషయాన్ని దేశమంతా గమనిస్తున్నదని ఆయన చెప్పారు. గ్రామ వలంటీర్ వ్యవస్థ ఏర్పాటులో సీఎం జగన్ ముందుచూపును ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారని, రాష్ట్రంలో ఏ ఇంట్లో జలుబు, జ్వరాలతో ఎంతమంది ఉన్నారో చిటికెలో చెప్పగలిగే సమాచారం ప్రభుత్వానికి అందుబాటులో ఉందని విజయసాయి తెలిపారు.