ఉద్రిక్తం: కన్నాపై చెప్పులతో దాడి, టీడీపీ కార్యకర్తలంటూ చితకబాదిన బీజేపీ
కావలి: బీజేపీ నేతలపై తెలుగుదేశం పార్టీ నేతలు మరోసారి దాడి చేశారు! గతంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు ఆయనపై దాడి జరిగింది. ఇటీవల అనంతపురంలో ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణపై దాడి ప్రయత్నం జరిగింది. ఇప్పుడు కావలిలో కన్నాపై చెప్పులతో దాడి చేశారు.
కన్నా కావలిలో ఉండగా చెప్పులతో దాడి చేశారు. టిడిపి వ్యక్తి దాడి చేసినట్లుగా గుర్తించిన బీజేపీ కార్యకర్తలు అతనిని వెంటాడి చితకబాదారు. ఇలాంటి రౌడీయిజాన్ని చూసి భయపడే ప్రసక్తి లేదని బీజేపీ నేతలు చెప్పారు. కన్నాపై దాడిని నిరసిస్తూ బీజేపీ నేతలు, కార్యకర్తలు కావలి పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. పరిస్థితి ఉద్రిక్తతగా ఉంది.
కన్నాపై దాడి అంశంపై యువమోర్చా నేత విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం అన్నింటా విఫలమైందని అందుకే ఆ పార్టీ వారు తమపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. కావలిలో చెప్పులతో దాడి చేసిన వ్యక్తిని బీజేపీ కార్యకర్తలు పట్టుకొని నిలదీయగా.. అతను మరొకరి ప్రోద్బలంతో దాడి చేసినట్లు అంగీకరించాడని అంటున్నారు.
Recommended Video
ఈ దాడిపై టీడీపీ నేత బీదా రవిచంద్ర మాట్లాడుతూ.. అది ఓ వ్యక్తి చేసిన ఘాతుకం కాదని, తనకు తెలిసినంత వరకు అతను మా ప్రాంతానికి చెందిన వాడు కాదన్నారు. కాగా, ఏపీలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని గవర్నర్కు ఏపీ బీజేపీ నేతలు ఫిర్యాదు చేసిన మరుసటి రోజే కన్నాపై దాడి జరగడం గమనార్హం.