వ్యవసాయ చట్టాలపై వైసీపీది యూటర్న్-టీడీపీ దగ్గర ట్రైనింగ్- సోము వీర్రాజు కామెంట్స్
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు గతంలో పార్లమెంటులో మద్దతిచ్చిన వైసీపీ.. ఇవాళ రైతు సంఘాలు చేపట్టిన భారత్ బంద్ కు మద్దతివ్వడాన్ని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తీవ్రంగా తప్పుబట్టారు. పార్లమెంటులో బిల్లులు ఆమోదించిన సమయంలో అక్కడే ఉన్న వైసీపీ ఎంపీలు.. ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని సోము మండిపడ్డారు.
కాలంచెల్లిన రైతు చట్టాలకు చెక్ పెట్టి, వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడానికి, రైతుల ఆర్థిక స్థోమత పటిష్టం చేయడానికి వీలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతు చట్టాల్లో మార్పులు తీసుకువచ్చారని ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. పార్లమెంటులో బిల్లును ఆమోదించిన కాలంలో ఆసమయంలో పార్లమెంట్లో ఉన్న వైసీపీ ఎంపీలు మద్దతుపలికి ఇప్పుడు బంద్'కు మద్దతు ఇవ్వడంలో 'యూటర్న్' తీసుకోవడంలో ప్రతిపక్ష పార్టీ దగ్గర వైసీపీ నేతలు శిక్షణ పొందారన్న అనుమానాలు రాష్ట్ర ప్రజలుకు కలుగుతున్నాయని సోమువీర్రాజు దుయ్యబట్టారు.
నూతన చట్టాల ప్రకారం,రైతు ఉత్పత్తులు విషయంలో బ్లాక్ మార్కెట్ కు పాల్పడే కొంతమంది రాజకీయ నాయకులకు తీవ్రంగా నష్టం, రైతన్నలకు లాభం వస్తోందనే ఈ చట్టాలను ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని సోము వీర్రాజు తెలిపారు. మహారాష్ట్ర, పంజాబ్, హర్యానాలలో రైతులు, రాజకీయ నాయకుల కబందహస్తాల్లో నలిగిపోతున్నారని,రైతులకు న్యాయం చేయడానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నా, ప్రతిపక్షాలు లేనిపోని అపోహలు సృష్టిస్తూ,భయాందోళనకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
నిత్యవసర సరకుల(సవరణ) బిల్లు దేశంలో ప్రస్తుతం అమలులో ఉన్న నిత్యవసర సరకుల చట్టం - 1955కి ఇది కొన్ని సవరణలతో వస్తుందని సోము తెలిపారు. నిత్యవసర సరకుల జాబితాలో ఉన్న వస్తువుల ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, వాణిజ్యాల నియంత్రణాధికారం కేంద్రానికి ఈ చట్టం దఖలు పరుస్తుందన్నారు. వ్యవసాయరంగంలో పోటీ, రైతుల ఆదాయం పెంచడానికి ఉద్దేశించిన చట్టంగా ఉందని ఆయన పేర్కొన్నారు. రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార(ప్రోత్సాహక, సులభతర) బిల్లు' వ్యవసాయ మార్కెట్లను నియంత్రించే మార్కెట్ కమిటీల ప్రాదేశిక సరిహద్దులతో సంబంధం లేకుండా దేశంలో వేర్వేరు రాష్ట్రాల మధ్య, రాష్ట్రాల్లో జిల్లాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యానికి ఇది అవకాశం కల్పిస్తుందని సోము వెల్లడించారు.
మార్కెట్ కమిటీల సరిహద్దులు దాటి విక్రయించే వ్యవసాయ ఉత్పత్తులపై రాష్ట్రాలు కానీ, స్థానిక ప్రభుత్వాలు కానీ ఎలాంటి పన్నులు వేయడానికి, ఫీజులు వసూలు చేయడానికి వీల్లేదని సోము తెలిపారు. ఎలక్ట్రానిక్ ట్రేడింగ్: నిర్దేశిత వాణిజ్య ప్రాంతంలో రాష్ట్రాల వ్యవసాయ మార్కెట్ కమిటీల నియంత్రణలోకి వచ్చే ఉత్పత్తుల ఎలక్ట్రానిక్ వర్తకానికి(ఈ-వర్తకం) ఇది అనుమతిస్తుందని ఆయన పేర్కొన్నారు. రైతుల (సాధికారత, రక్షణ) ధర హామీ, సేవల ఒప్పంద బిల్లు-2020 కాంట్రాక్ట్ ఫార్మింగ్: ఏ వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించయినా పంట వేయడానికి ముందే రైతు, కొనుగోలుదారు ఒప్పందం కుదుర్చుకునే వీలు కల్పిస్తుందని తెలిపారు. ఈ ఒప్పందాలు కనిష్ఠంగా ఒక పంటకాలం నుంచి అయిదేళ్ల వరకు చేసుకోవచ్చన్నారు.
వ్యవసాయ ఉత్పత్తుల ధర: ఒప్పందంలో వ్యవసాయ ఉత్పత్తుల ధరను పేర్కొనాలని, . ధర నిర్ణయ ప్రక్రియను ఒప్పందంలో రాయాలని సోము వీర్రాజు తెలిపారు. మూడంచెల వివాద పరిష్కార విధానం గురించి మాట్లాడుతూ... ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్లో తలెత్తే సమస్యల పరిష్కారానికి మూడంచెల వ్యవస్థ సయోధ్య(కన్సిలియేషన్) బోర్డ్, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, అప్పీలేట్ అథారిటీ ఉంటుందన్నారు. ఏదైనా వివాదం తలెత్తితే మొదట బోర్డు పరిధిలో సయోధ్యకు ప్రయత్నిస్తారు. అక్కడ పరిష్కారం కాకుంటే 30 రోజుల తరువాత సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ను సంప్రదించొచ్చని తెలిపారు. సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పీలేట్ అథారిటీని కూడా సంప్రదించొచ్చని తెలిపారు. అప్పీలేట్ అథారిటీగా ఐఏఎస్ స్థాయి అధికారులు ఉంటారన్నారు. ఈ చట్టాలపై చర్చలు జరపడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా ఎందుకు రాద్దాంతం చేస్తున్నారని సోమువీర్రాజు ప్రశ్నించారు.