రాజధానిగా అమరావతిపై తేల్చేసిన బీజేపీ: టీడీపీ-జనసేన పొత్తుతో మారిన వైఖరి?
విశాఖపట్నం: మూడు రాజధానులను ఏర్పాటు చేసే విషయంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గట్లేదు. దీనికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లును అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టడానికి కసరత్తు చేస్తోంది. దీనికి అసవరమైన ప్రక్రియను పూర్తి చేస్తోంది. ఈ సమావేశాల్లోనే ఈ బిల్లులను ఆమోదించే అవకాశాలు కనిపిస్తోన్నాయి. ఈ బిల్లు సభామోదం పొందితే- విశాఖపట్నాన్ని కేంద్రంగా చేసుకుని వైఎస్ జగన్ పరిపాలనను సాగించడం లాంఛనప్రాయమే అవుతుంది.
ఏపీ నిధులపై కన్నేసిన తెలంగాణ: కేంద్రం వద్దే తేల్చుకుంటాం: మంత్రి హరీష్ రావు ఘాటు లేక
31న సుప్రీంలో..
రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ ఏపీ హైకోర్టు ఇదివరకు జారీ చేసిన ఆదేశాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం స్టే విధించిన నేపథ్యంలో మూడు రాజధానుల ప్రక్రియ మరింత ఊపందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నెల 31వ తేదీన మరోసారి ఈ పిటీషన్లు సుప్రీంకోర్టు ముందుకు విచారణకు రానున్నాయి. రాజధాని ఎక్కడ ఉండాలనే విషయాన్ని నిర్ధారించడానికి కోర్టులు- టౌన్ ప్లానింగ్ కార్యాలయాలు కావంటూ ఇదివరకు న్యాయమూర్తులు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
రెండు నెలల్లో..
వచ్చే రెండు నెలల్లో విశాఖపట్నం నుంచి పరిపాలన ఆరంభమౌతుందంటూ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ సైతం స్పష్టం చేశారు. దీనికి అవసరమైన చర్యలు మొదలు పెట్టామనీ తేల్చి చెప్పారు. న్యాయపరమైన చిక్కులు పూర్తిగా తొలగిపోతాయని తాము ఆశిస్తోన్నామని, ఇక ఏ మాత్రం జాప్యం చేయకుండా అమరావతి ప్రాంతంలోని సచివాలయాన్ని విశాఖపట్నానికి తరలిస్తామని పేర్కొన్నారాయన.
ఏపీ బీజేపీ కీలక వ్యాఖ్యలు..
ఈ పరిస్థితుల మధ్య భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకులు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ-జనసేన మధ్య పొత్తు కుదరడం దాదాపుగా ఖాయమైన ప్రస్తుత పరిస్థితుల్లో రాజధానిగా అమరావతి కొనసాగింపుపై బీజేపీ నాయకుల వైఖరిని ఏమిటనేది అందరిలోనూ ఉత్కంఠతను రేకెత్తిస్తోంది. గతంలో బీజేపీ నాయకులు అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ డిమాండ్ సైతం చేశారు.
మా విధానం అదే..
ఉత్తరాంధ్రలో శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలపై సమీక్ష నిర్వహించడానికి విశాఖపట్నానికి వచ్చిన బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలనేదే తమ విధానమని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయమే కీలకమౌతుందని వ్యాఖ్యానించారు. రాజధానుల ఏర్పాటు విషయంలో కేంద్రం జోక్యం చేసుకోబోదంటూ పరోక్షంగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి సానుకూల సంకేతాలను ఇవ్వడాన్ని ఆయన గుర్తు చేశారు.
రాజధాని లేకుండా..
తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాయని సోము వీర్రాజు విమర్శించారు. టీడీపీ-వైఎస్ఆర్సీపీలను కుటుంబ పార్టీలుగా ఆయన అభివర్ణించారు. రాజధానిని నిర్మించకుండా టైంపాస్ చేస్తోన్నాయంటూ ధ్వజమెత్తారు. కేంద్రంలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం రాష్ట్రాన్నిఅభివృద్ధి చేస్తోందని, దీన్ని కూడా ఈ రెండు కుటుంబ పార్టీలు రాజకీయం చేస్తోన్నాయని ఆరోపించారు. ప్రాంతీయ పార్టీల పరిపాలనలో రాష్ట్రం ఎంతో నష్టపోయిందని అన్నారు.