అబ్దుల్ సలాం ఆత్మహత్య కేసుపై సోము వీర్రాజు సంచలనం- పోలీసుల్ని ఎలా అరెస్టు చేస్తారన్న బీజేపీ ఛీఫ్
నంద్యాలలో పోలీసు వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో ఏపీ ప్రభుత్వ తీరును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తప్పుబట్టారు. ఆత్మహత్య వ్యవహారంలో పోలీసులను అరెస్టు చేయడం సరికాదని సోము తెలిపారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటే సీఎంను అరెస్టు చేస్తారా అని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు.
నంద్యాలలో పోలీసు వేధింపులతో రైలు కిందపడి అబ్దుల్ సలాంతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో ముగ్గురుఆత్మహత్య చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ప్రాధమిక సాక్ష్యాధారాల ఆధారంగా పోలీసులు వేధించడం వల్లే వీరు ఆత్మహత్య చేసుకున్నారని నిర్ధారణ కావడంతో ప్రభుత్వం నంద్యాల సీఐ సోమశేఖర్రెడ్డితో పాటు మరో ఏఎస్సైను సస్పెండ్ చేసింది. దీంతో పాటు వీరిని అరెస్టు చేసి ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసును కూడా నమోదు చేసింది. రిమాండ్పై జైలుకు పంపాక వీరికి బెయిల్ లభించడంతో వీరు విడుదలయ్యారు. అయితే వీరికి బెయిల్ ఇప్పించిన లాయర్ టీడీపీకి చెందిన వ్యక్తి కావడంతో ఆయన పార్టీకి రాజీనామా కూడా చేశారు.
Recommended Video
ఇప్పుడు అబ్దుల్ సహాం వ్యవహారంలో వైసీపీ, టీడీపీ తీరును సోము వీర్రాజు తీవ్రంగా తప్పుబట్టారు. తమ డ్యూటీ చేసిన పోలీసులను అరెస్టు చేస్తారా అని సోము ప్రశ్నించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే సీఎంను అరెస్టు చేస్తామా అని ఆయన ప్రశ్నించారు. నంద్యాల ఘటనను చంద్రబాబు కూడా రాజకీయం చేస్తున్నారని సోము ఆరోపించారు. ముస్లింల పేరుతో టీడీపీ, వైసీపీ రాజకీయాలు చేస్తున్నాయని సోము విమర్శించారు. టీటీడీలో అక్రమాలను ప్రశ్నిస్తే తమపై హిందూత్వ ముద్ర వేస్తున్నారని, విదేశీ విద్య పథకానికి నిధులు ఇవ్వడం లేదని సోము ఆక్షేపించారు. తుంగభద్ర పుష్కరాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, ఘాట్లు నిర్మించనప్పుడు రూ.200 కోట్ల నిధులు విడుదల చేయడం ఎందుకన్నారు. నదిలో పుష్కర స్నానాలు చేయొద్దనడం సరికాదన్నారు.