డీజీపీ సవాంగ్పై క్రిమినల్ లా ప్రయోగం: పరువునష్టం దావాకూ వెనుకాడం: సోము వీర్రాజు వార్నింగ్
అమరావతి: రాష్ట్రంలో కొద్దిరోజుల కిందటి వరకు వరుసగా కొనసాగుతూ వచ్చిన ఆలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసం ఉదంతంపై రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతమ్ సవాంగ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కాక పుట్టిస్తున్నాయి. విగ్రహాల విధ్వంసం ఘటనల్లో తెలుగుదేశం, బీజేపీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఉన్నారనే విషయం తమ దర్యాప్తులో తేలిందంటూ ఆయన చేసిన ప్రకటన పట్ల రెండు పార్టీలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి.
డీజీపీకి సోము లేఖ
ఇప్పటికే టీడీపీ అగ్ర నాయకత్వం సహా పలువురు నేతలు ఘాటుగా స్పందించారు. డీజీపీ.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డాయి. తాజాగా- ఆ బాధ్యతను బీజేపీ నేతలు తీసుకున్నారు. టీడీపీ తరహాలోనే కమలనాథులు కూడా డీజీపీపై విమర్శలను సంధిస్తున్నారు. ఆరోపణలను గుప్పిస్తున్నారు. బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు మరో అడుగు ముందుకేశారు. లేఖ రాశారు. ఆలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసం ఘటనల్లో తమ పార్టీ కార్యకర్తలు ఉన్నారంటూ చేసిన ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అత్యున్నత పదవిలో ఉంటూ..
దీనిపై ఓ వివరణ ప్రకటనను జారీ చేయాలని అన్నారు. తమ పార్టీ కార్యకర్తల ప్రమేయం ఉన్నట్లు నిరూపించే సాక్ష్యాధారాలు ఉంటే వెంటనే బయటపెట్టాలని చెప్పారు. రాజ్యాంగబద్ధంగా, బాధ్యతాయుత హోదాలో ఉంటూ ప్రజలను పక్కదారి పట్టించేలా.. వారికి తప్పుడు సమాచారం చేరవేసేలా ప్రకటనలను జారీ చేయడం సరికాదని సోము వీర్రాజు పేర్కొన్నారు. ఆలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంస ఘటనల్లో తమ పార్టీకి చెందిన ఏ ఒక్క కార్యకర్త ప్రమేయం కూడా లేదని స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో పోస్ట్ చేసినంత మాత్రాన..
దాడికి గురైన విగ్రహాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినంత మాత్రాన.. వారే విధ్వంసానికి పాల్పడినట్టు కాదని అన్నారు. గౌతమ్ సవాంగ్ సారథ్యంలో.. రాష్ట్రంలో ఆలయాలు, విగ్రహాలకు రక్షణ కల్పించే విషయంలో పోలీసులు దారుణంగా విఫలం అయ్యారని ఆరోపించారు. పోలీసుల వైఫల్యం వల్లే రాష్ట్రంలో వరుసగా ఆలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసకర ఘటనలు చోటు చేసుకుంటున్నాయని సోము వీర్రాజు ఈ లేఖలో పేర్కొన్నారు. వాటికి రక్షణ కల్పించడంలో విఫలం అయ్యారని మండిపడ్డారు.
పరువు నష్టం దావా.. క్రిమినల్ లా
తమ పార్టీ ప్రతిష్ఠను ఉద్దేశపూరకంగా మంటగలిపేలా వ్యవహరించినట్లు తాము భావిస్తున్నామని తేల్చి చెప్పారు. ఒక అత్యున్నత హోదాలో ఉన్న ప్రభుత్వ అధికారిగా ఒక పార్టీకి మద్దతు ఇచ్చేలా.. మరో రాజకీయ పార్టీని విమర్శించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. తమ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేక భావం ఏర్పడేలా చేసిన ఈ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహిరించుకోవాలని, దీనికోసం ఓ వివరణ ప్రకటనను జారీ చేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. అలా చేయలేకపోతే.. తాము చట్టపరంగా చర్యలను తీసుకోవాల్సి వస్తుందని అన్నారు. క్రిమినల్ లా ప్రకారం చర్యలను తీసుకుంటామని, పరువునష్టం దావాను వేస్తామని హెచ్చరించారు.