సోము హస్తిన పర్యటన వేళ.. సుజనాకు ఝలక్: రామ్మాధవ్తో భేటీలో కీలక అంశాలు:
అమరావతి: భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీమంత్రి సుజనా చౌదరికి ఝలక్ ఇచ్చింది పార్టీ నాయకత్వం. తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీ తీర్థాన్ని పుచ్చుకున్న తరువాత.. ఆయనకు తొలిసారిగా పార్టీలో ఎదురుదెబ్బ తగిలినట్టు కనిపిస్తోంది. ఆయనకు ప్రతికూలంగా పార్టీలో వాతావరణం ఏర్పడిందనే సంకేతాలను పంపించింది. సుజనా చౌదరి, లంకా దినకర్ వంటి కొందరు టీడీపీ నుంచి వచ్చిన నాయకులు తాము ఏం చెబితే అది సాగుతుందనే వ్యవహారానికి బీజేపీ నేతలు చెక్ పెట్టినట్టే కనిపిస్తోంది.
సుజనా వ్యాఖ్యలతో సంబంధం లేదు..
బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియమితులు కావడం, ప్రస్తతం ఆయన హస్తిన పర్యటనలో ఉన్న సమయంలో ఏపీ బీజేపీ నాయకులు సుజనా చౌదరికి కాస్త గట్టిగానే ఝలక్ ఇచ్చారు. అమరావతి తరలింపు వ్యవహారంపై సుజనా చౌదరి తాజాగా చేసిన వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్రశాఖ నాయకులు బహిరంగంగానే తప్పు పట్టారు. సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమైనవేనని తేల్చి చెప్పారు. సుజనా చేసిన వ్యాఖ్యలతో పార్టీకి ఏ మాత్రం సంబంధం లేదని కుండబద్దలు కొట్టారు.
ఆయన వ్యక్తిగతం..
రాజధాని తరలింపు వ్యవహారం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందంటూ సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు పార్టీ అభిప్రాయం కాదని స్పష్టం చేశారు. రాజధాని నగరాన్ని ఇప్పుడున్న అమరావతి ప్రాంతంలోనే కొనసాగించాలా? లేదా? అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయమేనని ఏపీ బీజేపీ నాయకులు వివరణ ఇచ్చారు. రాష్ట్ర రాజధానిని ఎక్కడ నిర్ధారించాలనేది కేంద్రం పరిధిలో లేదని పునరుద్ఘాటించారు. అమరావతి కేంద్రం పరిధిలో ఉందంటూ సుజనా చౌదరి చేసిన ప్రకటనతో సంబంధం లేదని అన్నారు.
రామ్మాధవ్తో సోము భేటీ
ఇదిలావుండగా.. సోము వీర్రాజు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా ఆయన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్మాధవ్ను మర్యాదపూరకంగా కలిశారు. తనను పార్టీ అధ్యక్షుడిగా నియమించడం పట్ల కృతజ్ఙతలు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలపై చర్చించారు. పార్టీ అంతర్గత విషయానూ ఈ సందర్భంగా వారి మధ్య చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు. ప్రత్యేకించి- తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన నేతల వల్ల ఎదురవుతోన్న ఇబ్బందులను సోము వీర్రాజు ఈ సందర్భంగా రామ్మాధవ్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
గందరగోళంలో నెట్టేలా..
అమరావతిపై ప్రజలను గందరగోళానికి గురి చేసేలా సుజాన చౌదరి వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు బీజేపీ సీనియర్ నేతల్లో వ్యక్తమౌతున్నాయి. పార్టీ సిద్ధాంతానికి భిన్నంగా వారు స్పందిస్తున్నారని, దీనిపట్ల ప్రజల్లో బీజేపీపై తప్పుడు సంకేతాలు వెళ్తాయని విశ్వసిస్తున్నారు. కర్నూలులో రాజధాని ఏర్పాటు చేయాలనే విషయాన్ని బీజేపీ ముందు నుంచీ బలపరుస్తూ వస్తోందని, అదే సమయంలో సుజనా చౌదరి వంటి టీడీపీ నుంచి వచ్చిన నాయకులు దాన్ని తప్పు పట్టేలా వ్యాఖ్యలు చేస్తుండటం వల్ల ప్రజలు అయోమయానికి గురవుతారని అంటున్నారు.
Recommended Video
సుజనా నుంచి వివరణ కోరే అవకాశం..
ఈ పరిస్థితిని కల్పించడానికి ప్రధాన కారకుడిగా భావిస్తోన్న సుజనా చౌదరికి పార్టీ నాయకత్వం షోకాజ్ నోటీస్ జారీ చేసే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. రాజధాని అంశం పూర్తిగా రాష్ట్ర పరిధికి చెందినదేనంటూ సోము వీర్రాజు ప్రకటన చేసిన వెంటనే.. దాన్ని తప్పు పట్టేలా సుజనా చౌదరి వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. అమరావతి అంశం, మూడు రాజధానులపై భిన్న స్వరాన్ని వినిపిస్తోన్న సుజనా చౌదరి నుంచి బీజేపీ నాయకులు వివరణ కోరే ప్రయత్నం చేయవచ్చని తెలుస్తోంది.