ఏపీ బీజేపీ మెడకు కృష్ణా జల వివాదం ఉచ్చు: జగన్ నిర్ణయాన్ని నిరసిస్తూ తెలంగాణ బీజేపీ నిరసన దీక్ష
అమరావతి: కృష్ణా మిగులు జలాల పంపకాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తాజాగా నెలకొన్న వివాదం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుల మెడకు చుట్టుకుంటోంది. ఈ అంశంలో ఏపీ బీజేపీ నాయకులు తమ వైఖరిని స్పష్టం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. సొంత పార్టీకే చెందిన తెలంగాణ రాష్ట్రశాఖ నాయకులు తీసుకున్న సంచలన నిర్ణయం వల్ల ఏపీ బీజేపీని ఇబ్బందుల్లోకి నెట్టేసింది. అడకత్తెర చిక్కుకున్నట్లు తయారైంది ఏపీ బీజేపీ నాయకుల పరిస్థితి. ముందుకు వెళ్తే గొయ్యి.. వెనక్కి వెళ్లే నుయ్యిలా తయారైంది.
తెలంగాణాకు జరిగిన అన్యాయం ఏం లేదు .. వాటర్ వార్ పై ఏపీ మంత్రి అనీల్
పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచుతూ..
సముద్రంలో కలిసిపోయే కృష్ణా వరద నీరు, మిగులు జలాలను సంరక్షించుకోవడంలో భాగంగా రాయలసీమలో ఓ చిన్న తరహా నీటి ప్రాజెక్టును నిర్మించడానికి జగన్ ప్రభుత్వం కసరత్తు చేస్తోన్న విషయం తెలిసిందే. మూడు టీఎంసీల మిగులు జలాలను నిల్వ ఉంచుకునే సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును నిర్మించనుంది. ఈ మూడు టీఎంసీలను కూడా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి రాయలసీమకు తరలించాలనేది ప్రభుత్వం ఉద్దేశం. ఇందులో భాగంగా పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటరీ సామర్థ్యాన్ని పెంచుతూ ఇదివరకే జీవో నంబర్ 203ను జారీ చేసింది.
ఈ జీవోకు నిరసనగా.. బీజేపీ నిరసన దీక్షలు..
ఈ జీవోకు నిరసగా తెలంగాణ బీజేపీ నాయకులు నిరసన దీక్షలకు దిగబోతున్నారు. కాస్సేపట్లో ఈ దీక్షలు ఆరంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు.. జిల్లా, నియోజకవర్గ స్థాయి పార్టీ కార్యాలయాల్లో దీక్షకు కూర్చోబోతున్నారు. తెలంగాణ బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు, కరీంనగర్ లోక్సభ సభ్యుడు బండి సంజయ్.. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో దీక్ష చేయనున్నారు. మరో నాయకురాలు డీకే అరుణ తన నివాసంలో దీక్ష చేపట్టనున్నారు. జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులందరూ వేర్వేరుగా నిరసనల్లో పాల్గొనబోతున్నారు.
లక్ష్యంగా కేసీఆర్ సర్కారే అయినా.. ఏపీ బీజేపీకి సంకటంగా..
తెలంగాణ బీజేపీ నాయకులు చేపట్టిన ఈ దీక్షల లక్ష్యం కేసీఆర్ సర్కారే. అందులో సందేహాలు అక్కర్లేదు. కేసీఆర్ ప్రభుత్వాన్ని రాజకీయంగా ఇరుకున పెట్టడం, రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము అవిశ్రాంతంగా పోరాడుతున్నామనే బలమైన సందేశాన్ని తెలంగాణ ప్రజల్లోకి తీసుకెళ్లడమే బీజేపీ నేతల ప్రధాన ఉద్దేశం. బలంగా పాతుకుని పోయిన తెలంగాణ రాష్ట్ర సమితిపై రాజకీయంగా దాడి చేయడానికి వీలు ఉన్న ప్రతి అవకాశాన్నీ వినియోగించుకుంటోంది. ఇదీ అందులో భాగమే. అయినప్పటికీ.. ఆ చర్యలు కాస్తా ఏపీ బీజేపీ నాయకులకు ఇబ్బందికర పరిణామాలను సృష్టిస్తున్నాయి.
ఏపీ బీజేపీ ఏం చెబుతుంది?.. ఏం చేస్తుంది?
ఏ రకంగానైతే తెలంగాణ బీజేపీ నేతలు తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము పోరాడుతున్నామని చెబుతున్నారో.. అదే తరహాలో.. ఏపీ సంక్షేమం గురించి.. ప్రత్యేకించి రాయలసీమ దాహార్తిని తీర్చడానికి ఉద్దేశించిన ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ఏపీ బీజేపీ నాయకుల వైఖరి ఏమిటనేది ఇంకా స్పష్టం కావాల్సి ఉంది. బీజేపీ ఏం చెబుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ విషయంలో బీజేపీ జగన్ సర్కార్కు అండగా నిలవాల్సిన పరిస్థితి ఏర్పడినట్టే కనిపిస్తోంది.
మద్దతు ప్రకటించిన సోమగుంట..
రాయలసీమ మంచినీరు, సాగునీటిని అందించడానికి ఉద్దేశించిన ఈ ప్రాజెక్టు విషయంలో జగన్ సర్కార్ ముందుకు వెళ్లాల్సిందేనని బీజేపీ సీనియర్ నాయకుడు సోమగుంట విష్ణువర్ధన్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. వెనకడుగు వేయొద్దని అన్నారు. మిగులు జలాలను కూడా వినియోగించుకోకుండా ఉండేలా కేసీఆర్ అడ్డుపడటం సరికాదని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పని చేసిన అనుభవం ఉన్న కేసీఆర్కు రాయలసీమ కరవు గురించి తెలియదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ వైఖరి సరికాదని అన్నారు. వరద జలాలు, మిగులు నీటిని వృధాగా వదిలేయలేమని విష్ణువర్ధన్ రెడ్డి చెబుతున్నారు.