టీటీడీ నిధులతో ప్రభుత్వ బాండ్లా ? - ఏపీ హైకోర్టులో బీజేపీ పిల్
టీటీడీ నిధులతో ప్రభుత్వ బాండ్ల కొనుగోలు చేయాలన్న తిరుమల తిరుపతి దేవస్ధానం పాలకమండలి నిర్ణయంపై ఏపీ బీజేపీ భగ్గుమంది. ఈ వ్యవహారంపై స్పందించాలని కోరుతూ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డికి తిరుపతి బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి లీగల్ నోటీసులు పంపారు. అదే సమయంలో టీటీడీ నిర్ణయాన్ని అడ్డుకోవాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం కూడా దాఖలు చేశారు.
టీటీడీ నిధులతో ప్రభుత్వ బాండ్ల కొనుగోలు చేయాలన్న నిర్ణయాన్ని వ్యతరేకిస్తూ హైకోర్టులో పిల్ దాఖలు చేసినట్లు బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి తెలిపారు. అధిక వడ్డీ కోసం ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు పెట్టాలన్న నిర్ణయం సరికాదన్నారు. టీటీడీ నిధులు పక్కదారి పడుతున్నాయని, ప్రభుత్వ బాండ్ల కొనుగోలు నిర్ణయం నిలిపేయాలని ఆయన తన పిల్లో హైకోర్టును కోరారు. ఫైనాన్స్ కమిటీ సూచన మేరకు కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీల్లో నిధులు పెడుతున్నట్లు ఆగస్టు నెలలో టీటీడీ పాలకమండలి తీర్మానం చేసిందని భాను తన పిటిషన్లో పేర్కొన్నారు.
వివిధ జాతీయ బ్యాంకుల్లో టీటీడీ డిపాజిట్ చేసిన ఐదు వేల కోట్ల రూపాయల నిధులు డిసెంబర్లో కాల పరిమితి తీరనున్నాయని, వాటిని దారి మళ్లించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని భానుప్రకాశ్ రెడ్డి తన పిటిషన్లో ఆరోపించారు. ఈ వ్యవహారంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో పాటు ఈవో జవహర్రెడ్డిని ప్రతివాదులుగా చేర్చాలని పిల్లో భాను కోరారు. టీటీడీ పాలకమండలి తాజాగా తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. భక్తులిచ్చిన విరాళాలను ప్రభుత్వానికి పెట్టుబడిగా ఇవ్వడమేంటనే విమర్శలు వినిపిస్తున్నాయి.